Lottery scam : లాటరీ ‘స్కామ్’తో రూ. 2.10లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి!
Lottery scam : లాటరీ వచ్చిందంటే.. ముందు వెనక చూసుకోకుండా.. ఓ వ్యక్తి రూ. 2.10లక్షలు పోగొట్టుకున్నాడు. ముంబైలో జరిగింది ఈ ఘటన.
Lottery scam in Mumbai : 'లాటరీ స్కామ్'కు ఓ ముంబైవాసి బలయ్యాడు! లాటరీ వచ్చిందంటూ వచ్చిన ఫోన్ను నమ్మేసి.. రూ. 2.10లక్షలను ట్రాన్స్ఫర్ చేశాడు. అంతే! ఆ తర్వాతి నుంచి అటువైపు ఫోన్ను ఎత్తడం మానేశారు. చివరికి బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ముంబైకు చెందిన ఓ వ్యక్తి.. 2019లో ఆన్లైన్ స్టోర్లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. రెండేళ్ల తర్వాత.. పశ్చిమ్ బెంగాల్ ఆధారిత ఆ ఆన్లైన్ స్టోర్ నుంచి అంటూ ఓ లెటర్ వచ్చింది. ఆ వ్యక్తి పేరు.. లక్కీ డ్రాకు ఎంపికైనట్టు ఆ లెటర్లో రాసి ఉంది. ఆ లెటర్తో పాటు ఓ స్క్రాచ్ కార్డ్ కూడా వచ్చింది. ఆ ముంబైవాసి.. రూ. 10.4లక్షలు విలువ చేసే కారును గిఫ్ట్గా పొందినట్టు అందులో ఉంది.
Online scams in India : కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తికి ఓ కాల్ వచ్చింది. 'ఆన్లైన్ స్టోర్కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ని మాట్లాడుతున్నా..' అంటూ ఓ వ్యక్తి, ఆ ముంబైవాసితో మాట్లాడాడు. ముంబైవాసికి వచ్చిన గిఫ్ట్ గురించి వివరించారు. 'మీకు కారు కావాలా? లేదా ఆ నగదును మీకు ట్రాన్స్ఫర్ చేయాలా?' అని ఆ వ్యక్తి అడిగాడు. ఆ నగదును తన అకౌంట్కు బదిలీ చేయాల్సిందిగా ఈ వ్యక్తితో చెప్పాడు ఈ ముంబైవాసి. ఇక్కడే అసలు కథ మొదలైంది!
నగదును బదిలీ చేయాలంటే.. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీల కింద రూ. 2.10లక్షలు డిపాజిట్ చేయాలని ఆ వ్యక్తి ఈ ముంబైవాసికి చెప్పాడు. అది నమ్మిన ముంబైవాసి.. అతను చెప్పినట్టే డబ్బులు డిపాజిట్ చేసి.. రూ. 10.4లక్షల కోసం తన బ్యాంక్ ఆకౌంట్ను చూస్తూ కూర్చున్నాడు. కొన్ని రోజుల తర్వాత.. ఇంకొంత నగదును డిపాజిట్ చేయాలని మళ్లీ ఫోన్ వచ్చింది. అప్పుడు ఈ ముంబైవాసికి అనుమానం వచ్చింది. తాను ఇంక డబ్బులు డిపాజిట్ చేయనని, తన రూ. 2.10లక్షలను కూడా తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతి నుంచి అటువైపు ఫోన్ ఎత్తడం మానేశారు. చివరికి.. తాను మోసపోయినట్టు బాధితుడికి అర్థమైంది.
Mumbai crime news latest : ఈ క్రమంలోనే.. బాధితుడు పోలీసులను సంప్రదించాడు. తనకు జరిగినది వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.
ఎంత చెబుతున్నా..!
ఆన్లైన్ మోసాలు, స్కామ్లు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నాయి. అయినప్పటికీ.. ప్రజలు అత్యాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. అధికారులు ఎంత హెచ్చరించినా, పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు.
సంబంధిత కథనం