Gangrape: భర్త ముందే వివాహితపై సామూహిక అత్యాచారం; స్థానికంగా ఉద్రిక్తత-mp woman on picnic with husband allegedly gangraped by 5 men 100 rounded up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gangrape: భర్త ముందే వివాహితపై సామూహిక అత్యాచారం; స్థానికంగా ఉద్రిక్తత

Gangrape: భర్త ముందే వివాహితపై సామూహిక అత్యాచారం; స్థానికంగా ఉద్రిక్తత

Sudarshan V HT Telugu

Gangrape: భర్త కళ్లముందే వివాహితపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణం మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఈ ఘటనపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులపై మధ్యప్రదేశ్ పోలీసులు సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.

వివాహితపై సామూహిక అత్యాచారం

Gangrape: భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. సున్నితమైన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు 100 మందికి పైగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల అదుపులో 100 మంది

మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఉన్న గుర్హ్ తహసీల్ లోని పిక్నిక్ స్పాట్ లో సోమవారం ఈ గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బాధితురాలు, ఆమె భర్త 19-20 ఏళ్ల వయస్సు ఉన్నవారేనని, వారు ఇంకా కాలేజీలోనే చదువుతున్నారని రేవా హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) హిమాలి పాఠక్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా 100 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించామని, బాధితురాలి వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీఎస్పీ పాఠక్ తెలిపారు.

పిక్నిక్ కు వెళ్తే..

గుర్హ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రసిద్ధ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌంటెన్ సమీపంలో తనకు, తన భర్తకు మధ్య గొడవ జరిగిందని మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.ఆ తరువాత, తన భర్త కళ్లముందే ఫౌంటెన్ సమీపంలో ఐదుగురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, వారిలో ఒకరి చేతిపై, ఛాతీపై పచ్చబొట్లు ఉన్నాయని బాధితురాలు తెలిపింది. దీనిపై వారిద్దరూ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గుర్హ్ తహసీల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దాంతో పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి 7 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫొరెన్సిక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది.

అరెస్ట్ చేయలేదు..

ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే, 100 మందికి పైగా వ్యక్తులను, అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని అని డీఎస్పీ పాఠక్ తెలిపారు. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద సామూహిక అత్యాచారం, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.