Durga puja in madrasa : దసరా రోజున కొందరు ప్రజలు.. ఓ మదర్సాలోకి చొచ్చుకెళ్లి దుర్గా మాత పూజలు చేసిన ఘటన కర్ణాటక బీదర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భవనం వద్ద వారందరు పూజలు నిర్వహించి, భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఘటనకు సంబంధించి తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా.. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. అరెస్టులు చేయకపోతే.. భారీ ఆందోళనలు చేపడతామని ముస్లిం సంస్థలు పోలీసులకు హెచ్చరించాయి.
బీదర్లో 1460లో కట్టిన మహ్ముద్ గవాన్ మదర్సా.. ఏఎస్ఐ(పురావస్తుశాఖ) కిందకు వస్తుంది. జాతీయస్థాయి ప్రాముఖ్యత దీనికి ఉంది. కాగా.. బుధవారం సాయంత్రం.. కొందరు మదర్సా తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. "జై శ్రీరామ్" ,"హిందు ధర్మ్ జై" అంటూ నినాదాలు చేశారని వివరించారు.
ఆ తర్వాత.. భవనం మూలకు వెళ్లి పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Mahmud Gawan Madrasa : ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ముస్లిం సంస్థలు నిరసనలు మొదలుపెట్టాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈలోపు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.
ఈ ఘటనపై ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముస్లిం వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
Karnataka violence : మతపరమైన ఘటనలతో కర్ణాటక రాష్ట్రం ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. హిజాబ్తో దేశవ్యాప్తంగా కర్ణాటక హాట్టాపిక్గా మారింది. ఇక గణేశ చతుర్థి నాడు హుబ్బల్లిలోని ఇద్గా గ్రౌండ్లో వేడుకలు చేసుకున్న ఘటన చర్చకు దారి తీసింది.
సంబంధిత కథనం