Mizoram CM daughter : మిజోరాం సీఎం జోరంతంగా కుమార్తె వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఓ వైద్యుడి చెంప చెళ్లుమనిపించడం.. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. ఆమె చేసిన పనికి.. ముఖ్యమంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
మిజోరాం రాజధాని ఐజ్వాల్లోని ఓ క్లీనిక్కి వెళ్లి డర్మెంటాలజిస్ట్ను కలిసేందుకు ప్రయత్నించారు జోరంతంగా కుమార్తె మిలారి ఛంగ్తే. కాగా.. అపాయింట్మెంట్ లేకపోవడంతో ఆమెను కలిసేందుకు ఆయన నిరాకరించాడు. ఈ ఘటన బుధవారం జరిగినట్టు తెలుస్తోంది.
సీఎం కూతురైనా సరే.. అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అని ఆ వైద్యుడు చెప్పినట్టు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర అసంతృప్తి చెందిన మిలారి.. వైద్యుడి వద్దకు నడుచుకుంటూ వెళ్లి.. ఆయన చెంప చెళ్లుమనిపించారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆమెను అడ్డుకునేందుకు పలువురు విఫలయత్నం చేశారు.
సీఎం కుమార్తె వైద్యుడిపై దాడి చేసిన ఘటనను ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) తీవ్రంగా పరిగణించింది. శనివారం.. నల్ల బ్యాడ్జీలు వేసుకుని వైద్యులు విధులకు హాజరయ్యారు. సీఎంకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం.. జోరంతంగా కుటుంబంపై వ్యతిరేకత ఎదురైంది.
ఈ నేపథ్యంలో.. తన కూతురు చేసిన పనికి 78ఏళ్ల జోరంతంగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. ఆమె ప్రవర్తనను తాను ఏ విధంగానూ అంగీకరించనని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం