భారత యువకుడిని అప్పగించనున్న చైనా సైన్యం
Arunachal teen missing case | వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 18న అదృశ్యమైన అరుణాచల్ప్రదేశ్ యువకుడిని.. చైనా పీఎల్ఏ త్వరలో భారత్కు అప్పగించనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ట్వీట్ చేశారు.
China PLA India | చైనా సైనికుల వద్ద ఉన్న అరుణాచల్ప్రదేశ్ యువకుడు త్వరలోనే దేశానికి తిరిగి రానున్నాడు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు బుధవారం వెల్లడించారు.
"రిపబ్లిక్ డే సందర్భంగా భారత సైన్యం- చైనా పీఎల్ఏ మధ్య సంభాషణ జరిగింది. అరుణాచల్ప్రదేశ్ యువకుడిని అప్పగించేందుకు పీఎల్ఏ సానుకూలంగా స్పందించింది. విడుదల చేసేందుకు ఓ ప్రాంతాన్ని సూచించింది. ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం త్వరలో తెలుస్తుంది," అని రిజిజు ట్వీట్ చేశారు.
అపహరించారా.. అదృశ్యమయ్యాడా?
ఈ నెల 18న.. అరుణాచల్ప్రదేశ్ షియాంగ్లోని సియుంగ్లాలో మిరామ్ తారోన్ అనే 17ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యాడు. అతడు అదృశ్యమైన ప్రాంతం.. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంటుంది. అయితే తారోన్ అదృశ్యమవ్వలేదని, పీఎల్ఏ(పిపుల్స్ లిబరేషన్ ఆర్మీ) అతడిని అపహరించిందని అరుణాచల్ప్రదేశ్లోని బీజేపీ ఎంపీ తాపిర్ గావో ఆరోపించారు.
ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన భారత సైన్యం.. పీఎల్ఏను సంప్రదించింది. యువకుడి ఆచూకి కనుగొనేందుకు సహకరించాలని కోరింది. కొన్ని రోజుల తర్వాత.. ఓ వ్యక్తిని తమ భూభాగంలో గుర్తించినట్టు చైనా సమాచారం అందించింది. తదుపరి చర్యలు చేపట్టే ముందు.. తగిన వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఫలితంగా తరోన్ వ్యక్తిగత వివరాలు, అతడి ఫొటోను పీఎల్ఏకు అధికారులు ఇచ్చారు.