బస్సులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిర్భయ తరహా మరో ఘటన
ఢిల్లీ నిర్భయ ఘటనను తలపిస్తూ బీహార్లో మరో ఘాతుకం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్, సహాయకుడు, మరో వ్యక్తి కలిసి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బీహార్, జూన్ 8: 2012 నాటి నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు తరహాలోనే బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగరంలో ముగ్గురు వ్యక్తులు బస్సులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని బుధవారం పోలీసులు తెలిపారు.
ప్రాథమిక నివేదిక ప్రకారం.. బాధితురాలు పాక్షిక స్పృహతో బస్సులో కనిపించింది. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. డ్రైవర్, అతడి సహచరుడు తనకు ట్యాబ్లెట్లతో కూడి ఉన్న కూల్ డ్రింక్ ఇచ్చారని ఆమె ఆరోపించింది.
కూల్ డ్రింక్ తాగి ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. నిందితులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు.
‘పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో బస్సులో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. బాలిక పాక్షిక స్పృహతో బస్సులో కనిపించింది’ అని బెట్టియా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీఓ) ముకుల్ పాండే ఏఎన్ఐకి తెలిపారు.
అత్యాచారం కేసులో ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ‘బస్సును స్వాధీనం చేసుకున్నాం. బస్సు డ్రైవర్, అతడి సహాయకుడిని అరెస్టు చేశాం.’ అని పాండే తెలిపారు.
పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం పంపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఢిల్లీలో 2012 గ్యాంగ్రేప్ కేసులో 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, దారుణమైన లైంగిక దాడి జరిగింది. దేశవ్యాప్తంగా ఆ ఘటనపై ఆగ్రహం పెల్లుబికింది.
ఆ కేసులో ఆరుగురికి ప్రమేయం ఉండగా.. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరొక నిందితుడు నేరం జరిగిన సమయంలో మైనర్ అయినందున జువైనల్ హౌజ్లో మూడేళ్ల శిక్ష అనంతరం విడుదలయ్యాడు. వినయ్, అక్షయ్, పవన్, ముఖేష్ల నేరం రుజువైంది. ఈ కేసులో వారికి మరణశిక్ష పడింది.
సంబంధిత కథనం