Minor girl raped: యూపీలో దళిత బాలికపై హత్యాచారం; నిందితుడు కూడా మైనరే..
14 ఏళ్ల దళిత బాలికపై, స్థానికంగా ఉండే 16 ఏళ్ల బాలుడు అత్యాచారం జరిపి, హత్య చేసిన ఘటన యూపీ రాజధాని లక్నో సమీప గ్రామంలో జరిగింది. హత్య చేసిన తరువాత బాలిక మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీసి పారిపోయాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ నేరంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లక్నోలోని ఇందిరానగర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు పనికి పోవడంతో బాధితురాలైన బాలిక, ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చొరబడిన 16 ఏళ్ల బాలుడు ఆ బాలిక ఇద్దరు చెల్లెళ్లను వేరే గదిలో బంధించి, ఆ బాలికపై పై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమె తలపై రాయితో మోది హత్య చేశాడు. ఆ తరువాత, ఆ ఘటనను ఆత్మహత్యగా చూపడానికి, ఆ బాలిక మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీశాడు. అనంతరం ఆ ఇంటి నుంచి పారిపోయాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లి తన ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఆ బాలుడిని చూసింది.
ట్రెండింగ్ వార్తలు
స్థానికంగా ఆందోళన
బాధితురాలి మృతదేహంతో స్థానికులు రహదారిపై ధర్నా నిర్వహించారు. నిందితుడికి తక్షణమే శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నిందితుడు కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బలమైనదని, ఈ కేసు విషయంలో రాజీకి రానట్లయితే, తన మిగతా ఇద్దరు కూతుర్లకు కూడా ఇదే గతి పడ్తుందని బెదిరిస్తున్నారని బాధిత బాలిక తండ్రి ఆందోళన వ్యక్తం చేశాడు.
అత్యాచారం జరగలేదు..
అయితే, ఈ నేరంలో అత్యాచారం జరగలేదని, ఈ విషయం పోస్ట్ మార్టం లో తేలిందని పోలీసులు చెబుతున్నారు. హత్య మాత్రమే జరిగిందని వివరిస్తున్నారు. అయితే, పోలీసుల తీరును బాధితురాలి కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నారు. నిందితుల కుటుంబంతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. తమ కూతురిపై అత్యాచారం జరిగిందని పోస్ట్ మార్టం చేసిన వైద్యుడే స్వయంగా తనకు చెప్పాడని బాధితురాలి తండ్రి వివరించాడు.