Mehul Choksi news : రూ. 13వేల కుంభకోణానికి పాల్పడి దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త మెహుల్ చోక్సీని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వానికి షాక్ తగిలింది! మెహుల్ చోక్సీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. ఆయన్ని తమ దేశం నుంచి బహిష్కరించలేమని పేర్కొంది ఆంటిగ్వా- బార్బౌడాలోని ఓ హైకోర్టు. ఇది మెహుల్ చోక్సీకి భారీ ఊరటనిచ్చే విషయం.
ఇండియా నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గతకొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. కాగా ఆయన ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. కాగా.. 2021 మే 23న అక్కడి పోలీసులు మెహుల్ చోక్సీని దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నించారు! బలవంతంగా ఆయన్ని బోటులో ఎక్కించి డామినికాకు తరలించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంటిగ్వా కోర్టులో కేసు వేశారు మెహుల్ చోక్సీ. తనపై దాడి జరిగిందని, పోలీసులు తనతో అమానవీయంగా ప్రవర్తించారని, తనకు న్యాయం జరగాలని మహుల్ చోక్సీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత.. కేసులో డిఫెండెంట్లుగా ఉన్న ఆంటిగ్వా అటార్నీ జనరల్, చీఫ్ ఆఫ్ పోలీస్లకు ఉందని వెల్లడించారు.
Mehul Choksi case : ఈ కేసును శుక్రవారం విచారించిన ఆంటిగ్వాలోని హైకోర్టు.. ఆయనకు సానుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు లేకుండా.. మెహుల్ చోక్సీని దేశం నుంచి తొలగించకూడదని (బహిష్కరించకూడదని) స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. మెహుల్ చోక్సీ ఫిర్యాదు తప్పని నిరూపించుకోవాలి పోలీసులకు పేర్కొంది.
కాగా.. తమ చర్యలు చట్టాల పరిధిలోనే ఉన్నాయని ప్రతివాదులు కోర్టులో వాదించారు. మెహుల్ చోక్సీ ఫిర్యాదుల్లో అర్థం లేదని, విసుగుపుట్టించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి కోర్టుల దుర్వినియోగానికి కారణమవుతాయని వాదించారు.
Mehul Choksi arrest : పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ. 13వేల కోట్ల మోసానికి పాల్పడ్డారు మెహుల్ చోక్సీ. అనంతరం ఇండియా నుంచి పారిపోయారు. మోసాలు చేసి దేశంలో నుంచి పారిపోయిన వారిని పట్టుకునేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు సీబీఐ చెబుతోంది. 2018లో మెహుల్ చోక్సీపై తొలిసారిగా సీబీఐ కేసు వేసింది. 2022లో ఆయనపై మరో ఐదు క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. ఫలితంగా మెహుల్ చోక్సీ ఓ వాంటెడ్ క్రిమినల్గా మారారు.
తాజా పరిణామాలతో మెహుల్ చోక్సీని భారత్కు రప్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు మరింత కష్టతరంగా మారనున్నట్టు తెలుస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
సంబంధిత కథనం