పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం, చొరబడేందుకు పాక్ ప్రయత్నాలు : కేంద్రం-mea press conference pakistan actions provocative and escalatory tried to hit air base station in punjab says govt ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం, చొరబడేందుకు పాక్ ప్రయత్నాలు : కేంద్రం

పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం, చొరబడేందుకు పాక్ ప్రయత్నాలు : కేంద్రం

Anand Sai HT Telugu

పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు. దాడులతో ఉద్రిక్తతలు పెంచుతుందని, వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతుందన్నారు.

కల్నల్ సోఫియా ఖురేషి (@MEAIndia)

పరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు ఇద్దరు మహిళా సైనికాధికారులు పాల్గొన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పశ్చిమ సరిహద్దుల్లో పాక్ సైన్యం నిరంతరం దాడులు చేస్తోంది. భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, యుద్ధ ఆయుధాలు, యుద్ధ విమానాలను ఉపయోగించిందన్నారు. భారత్ తిప్పికొట్టిందని చెప్పారు.

పాక్ ప్రయత్నాలు

26కు పైగా చోట్ల వాయు మార్గం ద్వారా చొరబడేందుకు పాక్ ప్రయత్నించిందని, ఉధంపూర్, భుజ్, పఠాన్ కోట్, బటిండాలోని దాడులు జరుపుతోందని చెప్పారు. తెల్లవారుజామున 1:40 గంటలకు పంజాబ్ లోని వైమానిక స్థావరంపైకి హైస్పీడ్ క్షిపణులను ప్రయోగించారని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలపైనా దాడులు చేశారన్నారు.

ఉద్రిక్తతలు మరింత పెంచాలనే ఉద్దేశంతో పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని కేంద్రం తెలిపింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. పాక్ సైనిక బలగాలు ముందుకొస్తున్నట్టుగా గమనించామని పేర్కొంది.

వైమానిక స్థావరాలను కూల్చేశాం

'భారత సాయుధ దళాలు లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించాయి. కొన్ని పాక్ వైమానిక స్థావరాలను కూల్చివేశాయి. పౌర విమానాల ముసుగులో పాక్ దాడికి యత్నించింది. పాక్ దాడిలో నాలుగు వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఉధంపూర్, పఠాన్ కోట్, ఆదంపూర్, భుజ్ లలో నష్టం వాటిల్లింది.' అని కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు.

పాక్ తప్పుడు ప్రచారం

సకాలంలో, ప్రణాళికాబద్ధంగా స్పందించిన భారత సాయుధ దళాలు కచ్చితమైన దాడులు చేశాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. భారత ఎస్-400 వ్యవస్థను ధ్వంసం చేశామని, సూరత్, సిర్సా విమానాశ్రయాలను ధ్వంసం చేశామని పాకిస్థాన్ దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. పాక్ చేస్తున్న ఈ తప్పుడు ఆరోపణలను భారత్ ఖండిస్తోందన్నారు.

రహస్య స్థావరం ధ్వంసం

అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ జరిపిన కాల్పులకు ప్రతిస్పందనగా జమ్మూలోని అఖ్నూర్‌కు ఎదురుగా ఉన్న పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఉగ్రవాద రహస్య స్థావరాన్ని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ ఎఫ్ ) పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ శనివారం వెల్లడించింది. పాకిస్థాన్ లోని సియాల్ కోట్ జిల్లాలోని లుని వద్ద ఈ రహస్య స్థావరం ఉందని బీఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.

అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్ల పోస్టులు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికార ప్రతినిధి తెలిపారు. అఖ్నూర్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న సియాల్ కోట్ జిల్లాలోని లుని వద్ద ఉన్న ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని బీఎస్‌ఎఫ్ పూర్తిగా ధ్వంసం చేసిందన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.