పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టాం.. ఆ దేశం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోంది : భారత్-mea press conference on operation sindoor colonel sofiya qureshi and wing commander vyomika singh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టాం.. ఆ దేశం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోంది : భారత్

పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టాం.. ఆ దేశం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోంది : భారత్

Anand Sai HT Telugu

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించింది. ఈ సమాచారాన్ని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి అందించారు. వీరితోపాటుగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా మాట్లాడారు.

ఆపరేషన్ సిందూర్‌పై భారత్

ారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు రెండు రోజులు పూర్తయింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి రెండు రోజుల ఆపరేషన్ సిందూర్ గురించి ఇప్పటివరకు అన్ని అప్డేట్స్ పంచుకున్నారు. రెండో రోజున పాకిస్థాన్ భారత నగరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించిందని చెప్పారు. కానీ భారత సైన్యం ఈ ప్రయత్నాలను విఫలం చేసింది.

పాక్ దాడి చేసింది

ఉగ్రవాదులపై భారత సైన్యం చర్య తీసుకున్న తర్వాత పాకిస్థాన్ భారతదేశంలోని 15 ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం అన్ని దాడులను భగ్నం చేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మాత్రమే దాడి జరిగిందని భారత్ చెప్పింది. దీని తర్వాత కూడా పాకిస్థాన్ భారతదేశంలోని 15 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయాలని నిర్ణయించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల్లో మహిళలు, పిల్లలు సహా 16 మంది పౌరులు మరణించారు. లాహోర్ రాడార్ వ్యవస్థ ధ్వంసమైందని విలేకరుల సమావేశంలో తెలిసింది.

దాడి జరిగితే ప్రతిస్పందిస్తాం

విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. మే 7న భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. అలాగే భారతదేశంలోని ఏ సైనిక స్థావరంపైనైనా దాడి జరిగితే దానికి ప్రతిస్పందిస్తామని అన్నారు. తాజాగా పాకిస్థాన్ అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, బటిండా, చండీగఢ్, నల్ ఫలోడి, ఉత్తరలై, భుజ్‌లతో సహా అనేక సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ దాడులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ గ్రిడ్, వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. వాటి శిథిలాలను అనేక ప్రదేశాల నుండి స్వాధీనం చేసుకున్నారు.

లాహోర్‌లో వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం

దీంతో ఈ ఉదయం భారత దళాలు అనేక ప్రదేశాలలో పాకిస్థాన్ వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని సోఫియా ఖురేషి అన్నారు. దీంతో లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసమైందని తెలిసింది. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల తీవ్రతను పెంచిందని కల్నల్ సోఫియా అన్నారు. కుప్వారా, మెంధార్, బారాముల్లా, ఉరి, పూంచ్, రాజౌరిలలో మోర్టార్లు, భారీ ఫిరంగులు కనిపించాయి.

ఆధారాలు అందిస్తాం

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. 'ఇది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడితో ప్రారంభమైంది. నిన్న భారతదేశం తన చర్యతో ప్రతిస్పందించింది. పాకిస్థాన్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోంది. పాకిస్థాన్ చేసిన దాడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వాటి డ్రోన్లు, మిస్సైల్స్ శకలాలు సేకరించాం. ఆధారాలుగా ఐక్యరాజ్య సమితికి అందిస్తాం.' అని విక్రమ్ మిస్త్రీ అన్నారు.

ఉగ్రవాద కేంద్రాలు

మరణించిన ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసినట్టుగా విక్రమ్ మిస్త్రీ చెప్పారు. ప్రార్థనా మందిరాలను ఉగ్రవాద కేంద్రాలుగు మార్చారని పేర్కొన్నారు. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాక్‌లో ఉన్నారని మిస్త్రీ అన్నారు. సరిహద్దుల్లో 16 మంది మరణించారని చెప్పారు.

పహల్గామ్‌పై అంతర్జాతీయ దర్యాప్తు కమిటీ గురించి పాకిస్తాన్ మాట్లాడుతుందన్నారు విక్రమ్ మిస్త్రీ. కానీ దాని ట్రాక్ రికార్డ్ వేరేలా ఉందన్నారు. ముంబై, పఠాన్‌కోట్ దాడులతో సహా అనేక ఉగ్రవాద దాడులకు సంబంధించి భారతదేశం అనేక ఆధారాలను ఇచ్చినా దర్యాప్తు జరగలేదన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.