Jagdish Tytler in Congress MCD panel list: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న ఎన్నికలు, డిసెంబర్ 7న కౌంటింగ్ జరగనున్నాయి.
ఈ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ ప్రారంభించింది. అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఆ కమిటీలో పార్టీ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ కు స్థానం కల్పించడం విమర్శలకు తావిస్తోంది. జగదీశ్ టైట్లర్ ఢిల్లీకి చెందిన కీలక నాయకుడే కానీ, ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన తెరమరుగు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను దాదాపు పక్కన పెట్టేసింది. తాజాగా, MCD ఎన్నికల కమిటీలో ఆయనకు స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
MCD కమిటీ జాబితాలో జగదీశ్ టైట్లర్ తో పాటు ఢిల్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ చౌధరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ మాకెన్, సీనియర్ లీడర్ సందీప్ దీక్షిత్ తదితరులు ఉన్నారు. ఢిల్లీ అభ్యర్థుల ఎంపిక కమిటీలో జగదీశ్ టైట్లర్ కు అవకాశం ఇవ్వడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అల్లర్ల నిందితుడికి పార్టీలో కీలక పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని విమర్శించింది. సిక్కుల గాయాలపై కారం రుద్దుతోందని కాంగ్రెస్ పై బీజేపీ నేత ఆర్పీ సింగ్ ట్వీట్ చేశారు. సిక్కులకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ కు ఏ మాత్రం బాధ లేదన్న విషయం దీనిద్వారా స్పష్టమవుతుందని ఆయన విమర్శించారు.