ప్రయాగ్‌రాజ్‌లో మౌని అమవాస్య భయం.. సరిగ్గా 70 ఏళ్ల కిందట తొక్కిసలాటలో 800 మంది మృతి!-mauni amavasya fear in prayagraj and 1954 kumbh stampede leading to 800 deaths ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ప్రయాగ్‌రాజ్‌లో మౌని అమవాస్య భయం.. సరిగ్గా 70 ఏళ్ల కిందట తొక్కిసలాటలో 800 మంది మృతి!

ప్రయాగ్‌రాజ్‌లో మౌని అమవాస్య భయం.. సరిగ్గా 70 ఏళ్ల కిందట తొక్కిసలాటలో 800 మంది మృతి!

Anand Sai HT Telugu
Jan 29, 2025 12:34 PM IST

Prayagraj Stampede : ప్రయాగ్‌రాజ్‌లో మౌని అమవాస్య భయం వెంటాడుతోంది. తాజాగా జరిగిన తొక్కిసలాటలో చాలా మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే సరిగ్గా 70 ఏళ్ల కిందట జరిగిన తొక్కిసలాటలో వందల మంది మరణించారు.

మహా కుంభమేళాలో తొక్కిసలాట
మహా కుంభమేళాలో తొక్కిసలాట (Instagram)

ప్రయాగ్‌రాజ్‌లో మౌని అమవాస్య భయం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మౌని అమవాస్య రోజున జరిగిన కుంభమేళాలో దాదాపు 800 మంది మరణించారు.! స్వాతంత్య్రం వచ్చినాక జరిగిన మెుదటి కుంభమేళాలో ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం..

yearly horoscope entry point

800 మంది మృతి!

ఫిబ్రవరి 3, 1954న ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు మౌని అమావాస్య సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అకస్మాత్తుగా కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీని కారణంగా స్నానాల నుంచి పరుగులు పెడుతున్న సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ ఘటనలో దాదాపు 800 మంది భక్తులు మరణించారు. ఆ కుంభమేళాకు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా వచ్చారని చెబుతారు.

పుకార్లతో..

ఫిబ్రవరి 2, 3వ తేదీ మధ్య రాత్రి గంగానదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిందని ప్రచారం జరిగింది. సంగం ఒడ్డున ఉన్న సాధువులు, ఋషుల ఆశ్రమానికి నీరు చేరడం ప్రారంభమైందని చెప్పారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆ సంవత్సరం దాదాపు 50 లక్షల మంది భక్తులు జాతరలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే మొదటి కుంభమేళా కూడా. దీని కారణంగా కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అయితే కొందరు మరో కారణం చెబుతారు. పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శన, రద్దీ నియంత్రణ చర్యల వైఫల్యం, పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు హాజరు కావడమే తొక్కిసలాటకు దారితీసిందని అంటారు.

సుమారు 45 నిమిషాలు

సుమారు 45 నిమిషాల పాటు ఈ తొక్కిసలాట కొనసాగింది. కొద్దిసేపటికే జనం అదుపులోకి వచ్చారు. 800 మందికి పైగా మరణించారని గార్డియన్ పత్రిక నివేదించింది. అదే సమయంలో కనీసం 350 మంది నలిగిపోయి మునిగిపోయారని, 200 మంది తప్పిపోయారని, 2,000 మందికి పైగా గాయపడ్డారని టైమ్ నివేదించింది. మరోవైపు లా అండ్ ఆర్డర్ ఇన్ ఇండియా పుస్తకం ప్రకారం, 500 మందికి పైగా మరణించారు.

తొలి ప్రధాని హాజరు

1954 కుంభమేళాలో అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కూడా పాల్గొన్నారు. నెహ్రూ అమావాస్యకు ఒకరోజు ముందు వచ్చి సంగమంలో స్నానం కూడా చేశారని చెబుతారు. ప్రమాదం తర్వాత నెహ్రూ జస్టిస్ కమలాకాంత్ వర్మ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదం తర్వాత ఈ వేడుకకు వెళ్లవద్దని నాయకులు, వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. 1954 ఘటన తర్వాత కూడా మరికొన్ని తొక్కిసలాటలు జరిగి మరణాలు సంభవించాయి.

తాజా ఘటన

ఇక తాజా ఘటన 2025 జనవరి 29 తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది. మౌని అమావాస్య నాడు స్నానం చేయడానికి సంగమం వద్ద అకస్మాత్తుగా జనం పెరగడం ప్రారంభించారు. ప్రధాన సంగమం వద్ద మాత్రమే స్నానాలు చేయాలని ప్రజలు ఆసక్తి చూపించారు. పెరుగుతున్న రద్దీ కారణంగా సంగం మార్గంలో బారికేడింగ్ విరిగింది. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.