`కాశీ` జ్ఞాన్వాపీ తరువాత.. `మథుర` షాహీ ఈద్గా !
జ్ఞాన్వాపీ మసీదు వివాదం ముదురుతోంది. మసీదు ప్రాంగణంలోని కొలనులో శివలింగం లభ్యమైందన్న వార్త వైరల్ అయింది. మరోవైపు, `ఇప్పటికే బాబ్రీమసీదును పోగొట్టుకున్నాం. మరో మసీదు ను కోల్పోలేం` అని ఎంఐఎం నేత ఓవైసీ తేల్చి చెప్పారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనే మరో మసీదు వివాదం తెరపైకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్లో మసీదుల వివాదం రోజురోజుకీ తీవ్రమవుతోంది. జ్ఞాన్వాపీ మసీదు వివాదం కొనసాగుతుండగానే, మథురలోని కేశవ దేవ్ ఆలయ ప్రాంగణంలోని షాహీ ఈద్గా మసీదు వివాదం న్యాయస్థానం ముందుకు వెళ్లింది. కాట్రా కేశవ్దేవ్ ఆలయ ప్రాంగణంలోని షాహీ ఈద్గా మసీదును అక్కడి నుంచి తొలగించాలని మథుర జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషనకు విచారణార్హత ఉందని పేర్కొంది. దాంతో, ఇంతకుముందు ఈ పిటిషన్ను కొట్టేసిన కింది కోర్టు ఇప్పుడు ఈ పిటిషన్ను మళ్లీ విచారణకు స్వీకరించాల్సి వస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
2020 నాటి కేసు
ఇది 2020 నాటి కేసు. మథురలోని సీనియర్ డివిజన్ సివిల్ కోర్టులో సెప్టెంబర్ 25, 2020లో భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మాన్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. కేశవ్దేవ్ ఆలయ ప్రాంగణంలోని షాహీ ఈద్గా మసీదును అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ లక్నోకు చెందిన రంజన అగ్నిహోత్రి, మరో ఆరుగురు ఈ కేసు వేశారు. శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్ కు చెందిన 13.37 ఎకరాల స్థలంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని వారు ఆరోపించారు. ఆ మసీదును తొలగించి, ఆ స్థలాన్ని మళ్లీ ట్రస్ట్కు అప్పగించాలని కోరారు. అయితే, ఆ పిటిషన్కు విచారణార్హత లేదని పేర్కొంటూ సివిల్ కోర్టు దాన్ని కొట్టివేసింది. దాంతో పిటిషనర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు.
విచారణ జరపాలి
వాదనల అనంతరం ఈ పిటిషన్కు విచారణ అర్హత ఉందని జిల్లా కోర్టు న్యాయమూర్తి రాజీవ్ భార్తి అభిప్రాయపడ్డారు. తీర్పును సమీక్షించుకోవాలని కింది కోర్టును సూచించింది. మరోవైపు, షాహీ ఈద్గా మసీదులో నమాజ్ లను నిలిపేయాలని కోరుతూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, యూపీలోని 8 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది.