Manmohan Singh : ఆ ఒక్క ‘ఫోన్ కాల్’తో దేశ భవిష్యత్తు మారిపోయింది- 1991లో ఏం జరిగిందంటే..
Manmohan Singh death : 1991లో మన్మోహన్ సింగ్కి వచ్చిన ఒక ఫోన్ కాల్తో ఆయన జీవితం, కోట్లాది మంది భారతీయుల జీవితం, భారత దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. అంతటి కీలకమైన ఫోన్ కాల్ ఏంటి? 1991లో అసలేం జరిగింది? ఇక్కడ తెలుసుకోండి..
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 92ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి కన్నుమూశారు. ఒక ప్రధానిగా, ఒక ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. అయితే ఒక్క “ఫోన్ కాల్” ఆయన జీవితాన్ని, కోట్లాది మంది భారతీయుల జీవితాలను, భారత దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ఫోన్ కాల్ వల్లే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ.. అగ్రదేశాలకు బలమైన పోటీనిస్తూ ఎదుగుతోంది. అసలేంటి ఆ ఫోన్ కాల్? అసలేం జరిగింది?
ఒక్క ఫోన్ కాల్తో మారిపోయిన దేశ భవిష్యత్తు..
ఇది 1991 జూన్ నాటి సంఘటన! ఆ సమయంలో మన్మోహన్ సింగ్ యూజీసీ ఛైర్మన్గా ఉన్నారు. కాగా, నెథర్ల్యాండ్స్లో సమావేశాన్ని ముగించుకుని దిల్లీ తిరిగి వెళ్లారు. ఆ తర్వాత పడుకునేందుకు తన బెడ్రూమ్కి వెళ్లారు. అర్థరాత్రి వేళ మన్మోహన్ సింగ్ అల్లుడు విజయ్ థంఖకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది పీసీ అలెగ్జ్యాండర్. అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహా రావుకు ఆయన అత్యంత ఆప్తుడు! మన్మోహన్ సింగ్ని లేపాలని, అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలని అలెగ్జ్యాండర్ థంఖకు చెప్పారు.
కొన్ని గంటల తర్వాత అలెగ్జ్యాండర్- మన్మోహన్ సింగ్ కలుసుకున్నారు. "నరసింహా రావు నిన్ను ఆర్థిక మంత్రి చేయాలని భావిస్తున్నారు," అని అలెగ్జ్యాండర్ చెప్పారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని తనకు మంత్రి పదవి ఎందుకు ఇస్తారు అనుకుని ఆయన మాటలను మన్మోహన్ సింగ్ సీరియస్గా తీసుకోలేదు.
కానీ పీవీ నరసింహా రావు ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మర్చే శక్తి మన్మోహన్ సింగ్కి ఉందని ఆయన విశ్వసించారు. 1991 జనవరి 21న, మన్మోహన్ సింగ్ ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్లారు. కానీ ఆయన్ని ఆఫీస్ నుంచి ఇంటికి పంపించేశారు. "నువ్వు ఆర్థిక మంత్రి అవుతున్నావు. సాయంత్రం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి రెడీ అవ్వు," అని అధికారులు చెప్పి పంపించేశారు.
"నేను ప్రమాణం చేస్తున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నాకు పోర్ట్ఫోలియో కేటాయించారు. కానీ నేను ఆర్థిక మంత్రి అవుతానని నరసింహా రావు ముందే చెప్పారు," అని చాలా కాలం తర్వాత మన్మోహన్ సింగ్ వెల్లడించారు.
అండ్ ది రెస్ట్ ఈజ్ హిస్టరీ! ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఇప్పటికీ, ఎప్పటికీ భారతీయులు గర్వంగా చెప్పుకుంటారు. ప్రపంచంలో అగ్రదేశాలకు ధీటుగా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోందంటే, దానికి మన్మోహన్ సింగ్- పీవీ నరసింహ రావు తీసుకున్న బోల్డ్ నిర్ణయాలు ప్రధాన కారణం.
మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో కొన్ని..
1991లో నరసింహారావు మైనారిటీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ డిఫాల్ట్కు చాలా దగ్గరగా ఉంది. విదేశీ మారక నిల్వలు ఒక నెల దిగుమతులకు కూడా సరిపోవు! దేశం తన బంగారు నిల్వలను ఇంగ్లాండుకు రవాణా చేయాల్సిన అవమానాన్ని అనుభవించవలసి వచ్చింది.
మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ప్రసిద్ధ 1991 బడ్జెట్తో పాటు పారిశ్రామిక క్రమబద్ధీకరణతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో అపూర్వమైన సంపద సృష్టి చక్రాన్ని ఆవిష్కరించాయి. నియంత్రణ సడలింపులతో దేశీయ బాహ్య మార్కెట్లలో కొత్త అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. నిబంధనలను సడలించడంతో ఇన్ఫోసిస్కి 1990ల ప్రారంభంలో ఐపీఓగా వచ్చే అవకాశం దక్కింది. ఇది భారతదేశ ఈక్విటీ సంస్కృతిని ప్రేరేపించింది. అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థతో పాటు సెంటిమెంట్ బలపడటంతో దేశానికి అనేక విదేశీ పెట్టుబడులు వచ్చాయి. స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి.
సంబంధిత కథనం