భార్య చేతుల్లో మరో భర్త బలి! పెద్ద స్కెచ్​ వేసి.. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే హత్య-man tells spiritual guru about 18 acres land murdered by newly wed wife later ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భార్య చేతుల్లో మరో భర్త బలి! పెద్ద స్కెచ్​ వేసి.. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే హత్య

భార్య చేతుల్లో మరో భర్త బలి! పెద్ద స్కెచ్​ వేసి.. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే హత్య

Sharath Chitturi HT Telugu

ఓ 45ఏళ్ల వ్యక్తి ఆస్తిపై ఓ మహిళ కన్నేసింది! మారువేషంలో అతడిని సంప్రదించింది. పెళ్లి చేసుకుందామని ప్రపోజ్​ చేసింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ రెండు గంటల్లోనే తన సహచరులతో కలిసి ఆయన్ని చంపేసింది! ఈ ఘటన యూపీలో జరిగింది.

ఇంద్రకుమార్​ తివారీ- కుషి తివారీ (X)

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! 45ఏళ్ల వ్యక్తి ఆస్తిపై కన్నేసిన ఓ మహిళ.. మారువేషంలో ఆయన్ని వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే, తన సహచరులతో కలిసి చంపేసింది.

అసలేం జరిగింది?

పలు మీడియా కథనాల ప్రకారం మధ్యప్రదేశ్​ జబల్​పూర్​కి చెందిన ఇంద్రకుమార్​ తివారీకి 18 ఎకరాల భూమి ఉంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు పెళ్లి అవ్వడం లేదు. తీవ్ర మనస్తాపానికి గురైన తివారీ గత నెలలో మతగురువు గురు అనురుద్ధచార్య మహరాజ్​ దగ్గరికి వెళ్లాడు. అందరి ముందు తన బాధను గురువుతో చెప్పుకున్నాడు. తనకు ఆస్తి చాలానే ఉన్నప్పటికీ, పెళ్లి జరగడం లేదన్న అసహనంతో ఉన్నట్టు, తనతో కలిసి తన భూమిని చూసుకోవడానికి ఎవరూ లేరని చెప్పాడు.

ఆ మాటలు విన్న గురువు.. "సాధువు అయిపోయి, ఆ భూమిని ప్రజా సేవకు అంకితమివ్వమని" అని హాస్యం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇది జరిగిన కొన్ని రోజులకు కుషి తివారీ అనే మహిళ సోషల్​ మీడియా వేదికగా ఇంద్రకుమార్​ తివారీని సంప్రదించింది. ఆయనతో కొన్ని రోజులు మాట్లాడింది. చివరికి, పెళ్లి చేసుకుందామని చెప్పింది. వివాహం కోసం ఎదురుచూస్తున్న ఇంద్రకుమార్​ తివారీ, ముందువెనుక చూసుకోకుండా కుషి తివారీ ప్రపోజల్​ని అంగీకరించాడు.

కుషి అనే మహిళను పెళ్లి చేసుకుంటున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పి ఈ నెల 6న యూపీలోని కుషినగర్​కి వెళ్లాడు తివారీ. అక్కడి నుంచి కుషితో కలిసి గోరఖ్​పూర్​కి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే..!

ఇంద్రకుమార్​ పెళ్లైతే చేసుకున్నాడు కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు! పెళ్లి జరిగిన రెండు గంటల వ్యవధిలోనే కుషి తివారీ.. తన సహచరులతో కలిసి ఇంద్రకుమార్​ని చంపేసింది. అనంతరం మురికి కాలువలో పడేసింది. ఆయన దగ్గరున్న నగదు, బంగారు ఆభరణాలను తీసుకుని వారందరు అక్కడి నుంచి పారిపోయారు.

మెడ మీద కత్తితో కనిపించిన ఒక మృతదేహాన్ని చూసి షాకైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతుడు మధ్యప్రదేశ్​ వాసి అని యూపీ పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం మధ్యప్రదేశ్​ పోలీసులతో కలిసి దర్యాప్తును కొనసాగించారు.

ఈ క్రమంలోనే కుషి తివారీ గురించి అసలు విషయాలు వెలువడ్డాయి. కుషి తివారీ అసలు పేరు సాహిబా బానో! ఫేక్​ ఆధార్​ కార్డు సృష్టించి, ఇంద్రకుమార్​ని ఆమె మోసం చేసింది.

చివరికి పోలీసులు సాహిబాను అరెస్ట్​ చేశారు.

"సాహిబాతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్​ చేశాము. పెళ్లి ఫొటోలు ఉపయోగించి, ఒక విధవగా మృతుడి భూమిని పొందాలని సాహిబా ప్లాన్​ చేసింది. అందుకే ఇంద్రకుమార్​ని చంపేశారు," అని పోలీసులు వెల్లడించారు.

సాహిబా, ఆమె సహచరులు ఇలా మోసాలు చేయడం ఇది మొదటిసారి కాదని తెలుస్తోంది! ఆమె సహచరుల్లో ఒకడైన కుషాల్​ అనే వ్యక్తి.. ఈ ఏడాది తొలినాళ్లల్లో ఇదే విధంగా ఒక ఫేక్​ పెళ్లి చేసుకున్నాడు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.