ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో సహ జీవనం చేస్తున్న యువతితో గొడవలో 27 ఏళ్ల యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. అజయ్ రావత్, రాధికా సింగ్ లు డెహ్రాడూన్ లోని నెహ్రూ గ్రామ్ లో కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి కుటుంబాలు కూడా ఈ పెళ్లికి అంగీకారం తెలిపాయి. జూన్ 7న నిశ్చితార్థం, అక్టోబర్ 2న వివాహం జరగాల్సి ఉందని మృతుడు అజయ్ రావత్ తండ్రి దేవేంద్ర ప్రతాప్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అజయ్ రావత్, రాధికా సింగ్ ల మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రమై భౌతికదాడులకు దిగే స్థాయికి చేరింది. కోపంలో రాధిక సింగ్ కిచెన్ లోని కూరగాయల కత్తిని తీసుకువచ్చి, అజయ్ పై దాడి చేసింది. అజయ్ ఛాతి భాగంలో కత్తితో పొడిచింది. దాంతో, తీవ్రంగా రక్తస్రావం అవుతూ, అజయ్ కుప్పకూలిపోయాడు.
తమ మధ్య గొడవ జరిగిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని రాధిక పోలీసులకు తెలిపింది. కత్తితో ఛాతిలో పొడిచిన తరువాత, వెంటనే, ఇరుగుపొరుగువారిని పిలిచి, అతడిని వెంటనే డెహ్రాడూన్ కరోనేషన్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. చికిత్స పొందుతూ అజయ్ చనిపోయాడు. రాధికపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 (ఉద్దేశపూర్వక హత్య) కింద మే 4 న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రాయ్పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ప్రదీప్ నేగి తెలిపారు. రాధికా సింగ్ ను ప్రధాన నిందితురాలిగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
సంబంధిత కథనం