Mamata Banerjee: 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 215 కన్నా ఎక్కువ సీట్లే లక్ష్యం: మమతా బెనర్జీ-mamata sets more than 215 seat target for 2026 bengal assembly poll ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mamata Banerjee: 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 215 కన్నా ఎక్కువ సీట్లే లక్ష్యం: మమతా బెనర్జీ

Mamata Banerjee: 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 215 కన్నా ఎక్కువ సీట్లే లక్ష్యం: మమతా బెనర్జీ

Sudarshan V HT Telugu

Mamata Banerjee: 2026 లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 215 సీట్లకు పైగా గెలవడమే తమ లక్ష్యమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈసీ అండదండలతో బీజేపీ 'హర్యానా, గుజరాత్'లకు చెందిన నకిలీ ఓటర్లను బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చిందని ఆమె ఆరోపించారు.

మమత బెనర్జీ (ANI)

Mamata Banerjee: ఎన్నికల సంఘం (EC) అండదండలతో భారతీయ జనతా పార్టీ హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన నకిలీ ఓటర్లను బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో ఉన్న ఒక ఏజెన్సీ బెంగాల్ ఓటర్ల పేర్లను హర్యానా, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో భర్తీ చేస్తోందని, ఓటర్ ఐడి కార్డు నంబర్ ను అదే విధంగా ఉంచుతోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని సిఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది నేరుగా ఢిల్లీ నుంచే జరుగుతోందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ మిత్రపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది.

215+ సీట్లే లక్ష్యం

2026 లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో 215+ సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. ‘‘2026 ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లలో 215 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఆమె స్పష్టం చేశారు. 2021 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ 213 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. 2026 ఎన్నికలు సమీపిస్తుండటంతో తృణమూల్ కాంగ్రెస్ తన పునాదిని పటిష్టం చేసుకుని బీజేపీ సవాలును ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తోంది. '2021 కంటే కనీసం ఒక సీటును అదనంగా గెలుచుకోవాలనే అభిషేక్ (టీఎంసీ ఎంపీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ) అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. అదేసమయంలో మనం 215 లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

బీజేపీ కుట్ర

ఎన్నికలను ప్రభావితం చేయడానికి హర్యానా, గుజరాత్ ఓటర్లను బెంగాల్ లో ఓటర్లుగా నమోదు చేయడం ద్వారా బెంగాల్ లో గెలవాలని బీజేపీ కుట్ర చేస్తోందని మమత బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని ఉపయోగిందన్నారు. ఇలా మోసం చేసి మహారాష్ట్ర, హరియాణా, దిల్లీలో బీజేపీ విజయం సాధించిందని ఆరోపించారు. ‘‘బీజేపీని ఓడించి బెంగాల్ ను మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. కంగారు పడకండి, మళ్లీ గెలుస్తాం. మనం బెంగాల్, ఢిల్లీ లేదా మహారాష్ట్ర కాదు" అని సిఎం మమతా బెనర్జీ గురువారం టిఎంసి కార్యకర్తలతో అన్నారు.

ఓటర్ల జాబితా పరిశీలించండి

ప్రతీ చోట ఓటర్ల జాబితాను నేరుగా పరిశీలించడం ప్రారంభించాలని మమతా బెనర్జీ టీఎంసీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఓటర్ల జాబితాను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని మమతా బెనర్జీ హెచ్చరించారు.

అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా

2006లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమ సమయంలో తాను 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని, ఇప్పుడు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మమత అన్నారు. ‘ఓటరు జాబితా నుంచి నకిలీ పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరవధికంగా నిరసన తెలుపుతాం' అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.