NITI Aayog : ‘మాట్లాడనివ్వడం లేదు’.. నీతి ఆయోగ్ నుంచి మమతా బెనర్జీ వాకౌట్
నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత శనివారం ప్రారంభమైన నీతి అయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ నుంచి పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్న కారణంతో బయటకు వచ్చేసినట్టు ఆమె చెప్పారు.
"మీరు (కేంద్ర ప్రభుత్వం) రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపొద్దని చెప్పాను. నేను మాట్లాడాలనుకున్నాను కాని నా మైక్ మ్యూట్ అయింది. నన్ను ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారు. నా ముందున్న వారు 10-20 నిమిషాలు మాట్లాడారు,' అని నీతి ఆయోగ్ సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ విలేకరులతో అన్నారు.
ప్రతిపక్షాల నుంచి తాను మాత్రమే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నానని, అయినా తనను మాట్లాడనివ్వలేదని మమతా బెనర్జీ తెలిపారు. ఇది అవమానకరమని బెంగాల్ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు కొన్ని రోజుల ముందే ప్రకటించాయి. 2024 కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు వ్యతిరేకంగా పక్షపాతం చూపారనే ఆరోపణలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డీ ఈ సమావేశానికి హాజరుకావడం లేదని ప్రకటించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్తో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్, దిల్లీ ప్రభుత్వాలు కూడా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించాయి.
ఈ సమావేశానికి హాజరైన మమతా బెనర్జీ మాట్లాడుతూ ఉమ్మడి వేదికపై తమ గొంతును వినిపించాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కానీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.
ఈ సమావేశానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరవ్వలేదని తెలుస్తోంది.
నీతి ఆయోగ్..
2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంపై నీతి ఆయోగ్ సమావేశం దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్య పాలన, సహకారాన్ని పెంపొందించడం, పంపిణీ యంత్రాంగాలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రజల జీవన నాణ్యతను పెంచడం దీని లక్ష్యం.
నీతి ఆయోగ్ అత్యున్నత సంస్థ అయిన ఈ మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రధాని మోదీ నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నారు.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సు సిఫార్సులపైనా ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సదస్సులో తాగునీరు, పరిమాణం, నాణ్యత, విద్యుత్: నాణ్యత, సమర్థత, విశ్వసనీయత; ఆరోగ్యం: అందుబాటు, స్థోమత, సంరక్షణ నాణ్యత; పాఠశాల విద్య: ప్రాప్యత, నాణ్యత, భూమి, ఆస్తి: ప్రాప్యత, డిజిటలైజేషన్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వంటి ఐదు కీలక అంశాలపై సిఫార్సులు చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నారు.
2023లో నీతి ఆయోగ్ 10 సెక్టోరల్ థీమాటిక్ విజన్లను వికసిత్ భారత్ @2047 కోసం ఉమ్మడి విజన్గా క్రోడీకరించే బాధ్యతను అప్పగించింది.
ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలనతో సహా అభివృద్ధి వివిధ అంశాలను ఈ విజన్ కలిగి ఉంది.
సంబంధిత కథనం