Mallikarjun Kharge: బాధ్యతలు స్వీకరించిన ఖర్గే.. అపార అనుభవం ఫలితం ఇస్తుందా?-mallikarjun kharge officially takes charge as congress president ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mallikarjun Kharge Officially Takes Charge As Congress President

Mallikarjun Kharge: బాధ్యతలు స్వీకరించిన ఖర్గే.. అపార అనుభవం ఫలితం ఇస్తుందా?

Praveen Kumar Lenkala HT Telugu
Oct 26, 2022 12:07 PM IST

Mallikarjun Kharge: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఆయన అపార అనుభవం కాంగ్రెస్ పునరుజ్జీవంలో పనికొస్తుందా?

కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే (PTI)

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ట్రెండింగ్ వార్తలు

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అత్యున్నత పదవికి ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఇతర పార్టీలు కాంగ్రెస్ నుండి పాఠం నేర్చుకుని రహస్య బ్యాలెట్ ద్వారా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తాయని ఆశిస్తున్నానని మిస్త్రీ అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర సీనియర్ నేతలు, ఎంపీలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు ఖర్గే నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన ఇంట్లో కలిశారు. ఈ ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పాటు మాజీ డిప్యూటీ పీఎం జగ్జీవన్ రామ్‌లకు కూడా ఆయన నివాళులు అర్పించారు.

24 సంవత్సరాలలో నెహ్రూ-గాంధీ కుటుంబేతర మొదటి కాంగ్రెస్ చీఫ్‌గా ఖర్గే ఎన్నికయ్యారు. అపారమైన సంస్థాగత, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీకి నిరాకరించడంతో ఖర్గే పార్టీ అత్యున్నత పదవికి ఎన్నికల బరిలోకి దిగారు.

80 ఏళ్ల ఖర్గే శశి థరూర్‌పై "సోనియా విధేయ అభ్యర్థి"గా కనిపించారు. శశిథరూర్‌కు 1072 ఓట్లు రాగా.. ఖర్గే 7,897 ఓట్లు సాధించారు.

అట్టడుగు స్థాయి నుండి ఎదిగిన నాయకుడు ఖర్గే దళిత వర్గానికి చెందినవారు. 1968లో ఎస్.నిజలింగప్ప కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత కర్ణాటక నుండి పార్టీ అత్యున్నత పదవిని చేపట్టిన రెండో నాయకుడు.

క్రియాశీల రాజకీయాల్లో ఐదు దశాబ్దాల అనుభవంలో ఖర్గే కేంద్ర మంత్రిగా, లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. కర్ణాటకలో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి అనేక శాఖలను నిర్వహించారు.

హిందీ, ఇంగ్లీషు రెండింటిలోనూ మాట్లాడుతారు. పోరాట పటిమ కలిగి అందుబాటులో ఉండే రాజకీయ నాయకుడుగా పేరుంది. ఖర్గే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత బలంగా విమర్శిస్తూ వచ్చారు.

హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో కూడా కాంగ్రెస్ పునరుజ్జీవన వ్యూహాలను రూపొందించడానికి పలు సవాళ్లను ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పునాదులు బలహీనపడ్డాయి. ఆప్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఛాలెంజర్‌గా ఎదగాలని ప్రయత్నిస్తోంది.

ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఖర్గేకి తక్షణ సవాళ్లు. 2024లో జరిగే కీలక పోరుకు ముందు ఆయన సొంత రాష్ట్రమైన కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, తెలంగాణ సహా పలు ఇతర రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు.

చాలా మంది సీనియర్ పార్టీ నాయకులు ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ను వీడి వెళ్లారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి ఆ రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వం చేసిన ఎంపికలే కారణమని ఆరోపించారు.

భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన పాత్రను ఖర్గే నిర్ణయిస్తారని సూచించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత రాహుల్ గాంధీ పదవీవిరమణ చేసిన తర్వాత తాత్కాలిక చీఫ్‌గా పనిచేస్తున్న సోనియా గాంధీ నుండి ఖర్గే పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. సోనియా గాంధీ గతంలో 19 ఏళ్ల పాటు పార్టీని నడిపారు. రెండు యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

కేంద్ర కార్మిక, రైల్వే శాఖల మాజీ మంత్రిగా పని చేసిన ఖర్గే.. ఒక వ్యక్తి, ఒక పదవి నియమావళికి అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు.

జులై 21, 1942లో జన్మించిన ఖర్గే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1964-65లో గుల్బర్గాలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్టూడెంట్స్ యూనియన్‌కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

అతను 1966-67లో గుల్బర్గాలోని స్టూడెంట్స్ యూనియన్ లా కాలేజీకి ఉపాధ్యక్షుడిగా, 1969లో గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడయ్యాడు.

ఖర్గే 1972, 2009 మధ్య తొమ్మిది సార్లు కర్ణాటకలో ఎమ్మెల్యేగా పనిచేశారు. విద్య, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి,  భారీ - మధ్యతరహా పరిశ్రమలు, రవాణా, నీటి వనరులతో సహా మంత్రిగా అనేక శాఖలను నిర్వహించారు.

అతను 2005 నుండి 2008 వరకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1996-99, 2008-09 వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.

అతను 2009, 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.మరియు 2020లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా, అతను వివిధ సమస్యలను గట్టిగా లేవనెత్తారు.

కర్నాటకలో ముఖ్యమంత్రి పదవికి అనేకసార్లు ఖర్గే అగ్రశ్రేణి పోటీదారుగా కనిపించారు. కానీ ఎప్పుడూ ఆ పదవిని దక్కించుకోలేకపోయారు. అయినప్పటికీ ఖర్గే నిరసన వ్యక్తం చేయలేదు.  క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా పని చేస్తూనే ఉన్నారు.

కాంగ్రెస్ సుదీర్ఘ చరిత్రలో ఖర్గే రెండో దళిత అధ్యక్షుడని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ఖర్గే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రిగా అతను రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనను పునరుద్ధరించారు. సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులకు బీమా, ఇతర ప్రయోజనాలను పొడిగించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ ఆసుపత్రులను ఆధునీకరించారు.

రైల్వే మంత్రిగా ఆయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రైల్ టారిఫ్ రెగ్యులేటరీ అథారిటీ వంటి సంస్కరణలను తెచ్చారు.

బీజేపీ ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను కుటుంబ పాలన పార్టీ అంటూ చేసిన విమర్శలకు ఖర్గే ఎన్నిక చెక్ పెట్టినట్టయింది.

IPL_Entry_Point