Religious conversions: ‘‘మెజారిటీ మతస్తులు మైనారిటీగా మారిపోతారు’’- మత మార్పిడులపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Religious conversions: మత మార్పిడులపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మతమార్పిడులను ప్రోత్సహించే మతపరమైన సమావేశాలను 'తక్షణమే' నిలిపివేయాలని, లేకపోతే భారతదేశంలోని మెజారిటీ జనాభా మైనారిటీగా తగ్గిపోతుందని హెచ్చరించింది.
Religious conversions: భారతదేశంలో జరుగుతున్న మత మార్పిడులపై ఉత్తర ప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ బెంచ్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడులను ప్రోత్సహించే లక్ష్యంతో జరుగుతున్న మతపరమైన సమావేశాలను తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. లేదంటే, మెజారిటీ మతస్తులు త్వరలోనే మైనారిటీగా మారిపోతారని హెచ్చరించింది. మత మార్పిడులు జరిగే సమావేశాలను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
ప్రచారం పేరుతో మతమార్పిడి
పలువురు గ్రామస్తుల మతమార్పిడి (Religious conversions) కి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కైలాశ్ కు బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర ప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ప్రచారం అనే పదానికి ప్రచారం చేయడం అని మాత్రమే అర్థం. అంతే కానీ దాని అర్థం ఒక వ్యక్తిని అతని మతం నుండి మరొక మతంలోకి మార్చడం కాదు’’ అని జస్టిస్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.
క్రైస్తవంలోకి మార్చారు..
తన సోదరుడితో పాటు మరికొందరిని ఢిల్లీలో జరిగిన ఓ సభకు తమ గ్రామం నుంచి తీసుకెళ్లి క్రైస్తవ మతంలోకి మార్చారని రాంకాళి ప్రజాపతి అనే వ్యక్తి కైలాశ్ అనే వ్యక్తిపై చేసిన ఆరోపణలపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన సోదరుడు ఢిల్లీ నుంచి తిరిగి రాలేదని రాంకాళి ప్రజాపతి ఆరోపించారు. శ్రేయస్సు ముసుగులో గ్రామస్థులను వేడుకలకు తరలించి క్రైస్తవ మతంలోకి మార్చినట్లు కైలాష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కైలాశ్ కు బెయిల్ నిరాకరిస్తూ.. మతపరమైన సమావేశాల పేరుతో మతమార్పిడుల ధోరణిని ఆపకపోతే మెజారిటీ ప్రజలు మైనారిటీలో పడతారని జస్టిస్ అగర్వాల్ హెచ్చరించారు.
సాక్ష్యాధారాలున్నాయి...
న్యూఢిల్లీలో మతపరమైన సమావేశాలకు హాజరయ్యేందుకు కైలాశ్ ప్రజలను తీసుకెళ్తున్నాడని, అక్కడ వారిని క్రిస్టియన్ మతంలోకి మారుస్తున్నారని దర్యాప్తు అధికారి నమోదు చేసిన వాంగ్మూలాల్లో వెల్లడైందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతటా ఎస్సీ, ఎస్టీ కులాలు, ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులతో సహా ఇతర కులాల ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చే చట్టవ్యతిరేక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని పలు కేసుల్లో ఈ కోర్టు దృష్టికి వచ్చిందని కోర్టు పేర్కొంది.
2011 జనాభా లెక్కల వివరాలు..
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో హిందువులు 79.8 శాతం, ముస్లింలు 14.2 శాతం, క్రైస్తవులు 2.3 శాతం, సిక్కులు 1.7 శాతం ఉన్నారు. కైలాశ్ పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఢిల్లీలో జరిగే క్రైస్తవ మత ప్రచార సమావేశానికి రాంకాళి ప్రజాపతి సోదరుడు రాంపాల్ తో పాటు గ్రామంలోని మరికొందరిని కైలాశ్ తీసుకువెళ్లాడు. అక్కడ వారితో మతమార్పిడి కార్యక్రమం నిర్వహించాడు. గతంలో కూడా వారి గ్రామానికి చెందిన పలువురిని ఇలాంటి కార్యక్రమాలకు తీసుకువెళ్లి క్రైస్తవ మతంలోకి మార్చాడు. మానసిక వ్యాధితో బాధపడుతున్న తన సోదరుడికి చికిత్స చేయించి వారం రోజుల్లో తిరిగి తీసుకు వస్తానని కైలాశ్ తనకు హామీ ఇచ్చాడని రాంకాళి ప్రజాపతి పోలీసులకు తెలిపాడు.