Maharashtra politics : గురువారమే బలపరీక్ష.. ఉద్ధవ్ ప్రభుత్వానికి చివరి రోజు!
Maharashtra politics : గురువారం ఉదయం 11 గంటలకు.. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు.
Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగాయి. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి బలపరీక్ష గండం ఏర్పడింది. గురువారం ఉదయం 11గంటలకు.. అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ.. ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక శాసనసభ సెషన్ను నిర్వహించాలని అసెంబ్లీ సెక్రటరీ రాజేంద్ర భగవత్కు ఓ లేఖ రాశారు.
ట్రెండింగ్ వార్తలు
మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని, బల పరీక్ష ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలివ్వాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే.. చర్యలు చేపట్టారు గవర్నర్.
గవర్నర్ లేఖ..
మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తన లేఖలో పేర్కొన్నారు భగత్ సింగ్.
"మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఆందోనకరంగా ఉన్నాయి. 39మంది శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశిస్తున్నాను," అని లేఖలో గవర్నర్ అన్నారు.
గౌహతీ టు గోవా..?
Eknath Shinde : గురువారం జరగనున్న బలపరీక్షకు హాజరయ్యేందుకు.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్స్ సన్నద్ధమవుతున్నారు. గురువారం ఉదయం ముంబైకు చేరుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం గౌహతీలోని ఓ హోటల్లో ఉన్న వారందరు.. కొన్ని గంటల్లో గోవాకు వెళతారని సమాచారం.
గోవా కూడా.. బీజేపీ పాలిత రాష్ట్రమే కావడం గమనార్హం.
సుప్రీంకు ఉద్ధవ్ బృందం..
బలపరీక్షకు గవర్నర్ ఆదేశించిన కొద్ది సేపటికే.. ఉద్ధవ్ ఠాక్రే బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 16మంది ఎమ్మెల్యేలు.. తమపై ఉన్న అనర్హత వేటు గురించి ఇంకా స్పందించలేదని, అందువల్ల గవర్నర్ ఆదేశాలు చెల్లవని సుప్రీంకోర్టును విన్నవించింది.
"ఎమ్మెల్యేల అనర్హత వేటుపై జులై 11న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మరి బలపరీక్షకు గవర్నర్ ఎలా ఆదేశాలివ్వగలరు? అనర్హత వేటు ఉన్న ఎమ్మెల్యేలు బలపరీక్షలో ఎలా పాల్గొంటారు? ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అందుకే మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము," అని శివసేన ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.
రెబల్స్.. రెబల్స్..
Uddhav Thackery : 2019 ఎన్నికల అనంతరం.. బీజేపీతో విడిపోయి, ఎన్సీపీ- కాంగ్రెస్తో కలిసి మహ వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు.
కాగా.. అప్పటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ చేతిలో కీలుబొమ్మగా మారారని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే. 15మంది ఎమ్మెల్యేలతో గుజరాత్లోని సూరత్కు వెళ్లారు. అక్కడి నుంచి గౌహతీకి వెళ్లారు. రోజులు గడిచే కొద్ది.. ఏక్నాథ్కు మద్దతు పెరిగింది. ప్రస్తుతం ఆయన వద్ద 40కుపైగా శివసేన ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
శివసేన అభ్యర్థనను తోసిపుచ్చి.. గురువారం బలపరీక్షకు సుప్రీంకోర్టు అనుమతినిస్తే.. మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వానికి అదే చివరి రోజు అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సంబంధిత కథనం