Maharashtra blast: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
Maharashtra blast: మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలింది.
Maharashtra blast: మహారాష్ట్రలోని భండారా జిల్లా జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడులో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్ప కూలింది. ఆ శిథిలాలను తొలగించేందుకు ఎర్త్ మూవర్లను రంగంలోకి దించారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడును దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. ‘‘ఓ విషాదకర సంఘటన జరిగింది. భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుల ఆత్మశాంతి కోసం ప్రతి ఒక్కరూ ఒక నిమిషం నిలబడి మౌనం పాటించాలని నేను కోరుతున్నాను’’ అని గడ్కరీ నాగ్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.

రక్షణ మంత్రి స్పందన
ఈ పేలుడుపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 'మహారాష్ట్రలోని భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఘటనా స్థలంలో రెస్క్యూ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తన్నాయి. బాధితులకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం' అని రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందిస్తూ ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యమని అన్నారు.