Maha Kumbh Mela : మహా కుంభమేళాకు వెళ్లే వారికి గుడ్ న్యూస్! విమాన ధరలు 50శాతం కట్..
Maha Kumbh Mela flight rates : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! విమాన టికెట్ ధరలను 50శాతం కట్ చేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రకటించారు. పూర్తి వివరాలు..
మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు వెళ్లి, తిరుగు ప్రయాణమయ్యే విమానాల టికెట్ ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. అనేక విమానయాన సంస్థలు దేశంలోని అనేక చోట్లు సాధారణ టికెట్ రేట్ల కన్నా 5,6 రెట్లు అధికంగా వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. భక్తుల సెంటిమెంట్పై వ్యాపారం చేస్తున్నాయని ప్రజలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళాకు వెళుతున్న భక్తులకు ఊరటనిచ్చే విధంగా, విమాన టికెట్ ధరలను 50శాతం కట్ చేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి కే. రామ్ మోహన్ నాయుడు ప్రకటించారు.

మహా కుంభమేళాకు వెళ్లే విమానాల టికెట్ ధరలు తగ్గింపు..
మహా కుంభమేళా నేపథ్యంలో నానాటికి పెరిగిపోతున్న విమాన టికెట్ ధరలను కేంద్రం కట్టడి చేసింది. 50శాతం వరకు టికెట్ రేట్లు తగ్గించాలని విమానయాన సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా సంస్థలతో మూడుసార్లు సమావేశమైనట్టు రామ్ మోహన్ నాయుడు వెల్లడించారు.
మహా కుంభమేళా వంటి అత్యంత పవిత్ర కార్యక్రమాలు 140 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని, వాటి విశిష్టతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని విమానయాన సంస్థలకు కేంద్రం గుర్తుచేసింది.
వాస్తవానికి జనవరి 23నే ఈ విషయంపై డీజీసీఏ విమానయాన సంస్థలతో చర్చలు జరిపింది. డిమాండ్కు తగ్గట్టు విమాన సేవలను పెంచాలని, టికెట్ రేట్లు హేతుబద్ధీకరించాలని స్పష్టం చేసింది. కానీ విమాన టికెట్ రేట్ల విషయంలో పెద్దగా మార్పులు కనిపించలేదు. జనవరి 31వరకు హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు విమాన టికెట్ ధర రూ. 53వేల వరకు వెళ్లింది. ముంబై, బెంగళూరు సహా అనేక నగరాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు రూ. 5వేల నుంచి రూ. 6వేలు మాత్రమే అవుతుంది!
జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. ఇప్పటికే 199.4 మిలియన్ మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు. ఫలితంగా విమాన సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సేవలను పెంచాలన్న విజ్ఞప్తితో స్పైస్జెట్ సహా అనేక సంస్థలు నిత్యం 130కిపైగా విమానాలను ప్రయాగ్రాజ్కు నడుపుతున్నాయి. ఇప్పుడు టికెట్ రేట్లు కూడా దిగిరావడంతో ప్రజలకు ఊరట లభించినట్టు అయ్యింది.
సంబంధిత కథనం