Maharashtra crisis: రెబల్ ఎమ్మెల్యేల రాకలో జాప్యం.. ఎందుకంటే..
మహారాష్ట్ర సంక్షోభం ఎప్పటికప్పుడు ఉత్కంఠను రేపుతోంది. రెబెల్ ఎమ్మెల్యేలు తమ గోవా టూర్ను రీషెడ్యూలు చేసుకున్నారు.
గువాహటి (అసోం), జూన్ 29: గువాహటిలోని ఓ హోటళ్లో క్యాంపు నిర్వహిస్తున్న ఏక్నాథ్ షిండే మద్దతుదారులు ఈ సాయంత్రం గోవా చేరుకోవాల్సి ఉండగా.. పర్యటనను రీషెడ్యూలు చేసుకున్నారు. గురువారం ఉదయం సభలో బలపరీక్షకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్ ఈ సాయంత్రం 5 గంటలకు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈనేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ ప్రయాణాన్ని సాయంత్రానికి వాయిదా వేసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను జూన్ 30న సభలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు.
ఈనేపథ్యంలో సుప్రీం కోర్టు విచారణ సాయంత్రం రానున్నందున రెబెల్ ఎమ్మెల్యేలు గోవాకు ఈ సాయంత్రం 7 గంటలకు బయలుదేరనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ తమకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని, తమను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
‘మేం రేపు ముంబై చేరుకుంటాం. 50 ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. మాకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. ఫ్లోర్ టెస్ట్ గురించి మేం భయపడడం లేదు. మేం అన్నింటా విజయం సాధించాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో మెజారిటీదే నడుస్తుంది. మాకు మెజారిటీ ఉంది..’ అని ఏక్నాథ్ షిండే అన్నారు.
ఏక్నాథ్ షిండే ఈ ఉదయం రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి కామాఖ్యమ్మ ఆలయాన్ని సందర్శించారు.
రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణం కలత చెందే రీతిలో ఉందని చెబుతూ జూన్ 30న తన మెజారిటీని సభలో నిరూపించుకోవాలని గవర్నర్ కోష్యారీ ఈ ఉదయం ఉద్దవ్ థాకరేను ఆదేశించారు.
రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి గవర్నర్ లేఖ రాస్తూ గురువారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రిపై విశ్వాస తీర్మానానికి సంబంధించిన ఎజెండా మాత్రమే ఉండాలని ఆదేశించారు. నోటిఫికేషన్ ప్రకారం అసెంబ్లీ సెషన్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ మంగళవారం రాత్రి గవర్నర్ గవర్నర్ను కలిశారు. వెంటనే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరుతూ ఒక లేఖ సమర్పించారు.