Live news today :ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
- Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ హెచ్టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి.
Mon, 22 May 202305:55 PM IST
శ్రీ సిమెంట్స్ లాభాల్లో క్షీణత.. డివిడెండ్ ప్రకటన
2022-23 నాలుగో క్వార్టర్ ఫలితాలను శ్రీ సిమెంట్స్ సంస్థ ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో రూ.546.21 కోట్ల నికర లాభాన్ని ఆ సంస్థ సాధించింది. కిందటి ఏడాది ఇదే క్వార్టర్ (రూ.645.21)తో పోలిస్తే ఇది 15.3 శాతం తక్కువ. మరోవైపు నాలుగో క్వార్టర్లో 4,785.11 కోట్ల ఆదాయం వచ్చినట్టు శ్రీ సిమెంట్ వెల్లడించింది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికం(రూ.4,098.7 కోట్లు)తో పోలిస్తే ఇది 16.7 శాతం ఎక్కువ. కాగా, ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్కు రూ.55 రెండో మధ్యంతర డివిడెంట్ను శ్రీ సిమెంట్స్ ప్రకటించింది.
Mon, 22 May 202305:01 PM IST
నేను ప్రధాని అభ్యర్థిని కాదు: నితీశ్ కుమార్
ప్రతిపక్షాలన్నింటినీ ఏకాతాటిపైకి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా అదే దిశగా పని చేస్తున్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పానని, అందుకే తాను ప్రధాని అభ్యర్థిగా ఉండే ప్రశ్నే లేదని పవార్ స్పష్టం చేశారు.
Mon, 22 May 202304:04 PM IST
గోమూత్రంతో అసెంబ్లీ శుద్ధి
కర్ణాటక అసెంబ్లీ పరిసరాల్లో గోమూత్రాన్ని చల్లారు కాంగ్రెస్ నాయకులు. బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ ఇలా చేశారు. గోమూత్రంతో విధానసభను శుద్ధి చేస్తున్నామన్నారు. ఈ నెల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సిద్ధరామయ్య.. ముఖ్యమంత్రి అయ్యారు.
Mon, 22 May 202303:40 PM IST
అప్పటికల్లా రామమందిర తొలి దశ నిర్మాణం పూర్తి
ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీలోగా అయోధ్యలో రామమందిర తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని రామమందిర్ కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. 2024 డిసెంబర్ 30 నాటికి రెండో అంతస్తు నిర్మాణం కూడా పూర్తవుతుందని తెలిపారు.
Mon, 22 May 202303:15 PM IST
వాట్సాప్కు ఎడిట్ మెసేజ్ ఫీచర్
యూజర్లందరికీ మెసేజ్ ఎడిట్ ఫీచర్ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. రోల్అవుట్ను ప్రారంభించింది. రానున్న కొన్ని వారాల్లో అందరికీ ఈ ఫీచర్ యాడ్ అవుతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా 15 నిమిషాల వరకు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mon, 22 May 202302:24 PM IST
జనగణన భవన్ను ప్రారంభించిన అమిత్ షా
ఢిల్లీలో జనగణన భవన్ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. జనాభా లెక్కల కార్యకలాపాల కోసం కోసం ఈ భవనం ఏర్పాటైంది.
Union Home Minister Amit Shah inaugurated Janganana Bhawan in Delhi. pic.twitter.com/h02Zp8JQBv
— ANI (@ANI) May 22, 2023
Mon, 22 May 202301:55 PM IST
ఢిల్లీలో సూర్యుడి ప్రతాపం
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఎండ తీవ్రమైంది. ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Mon, 22 May 202301:09 PM IST
ఖర్గే, రాహుల్ గాంధీతో నితీశ్ కుమార్ భేటీ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీతో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నేడు భేటీ అయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసే కార్యాచరణ గురించి వారు చర్చించారు.
Mon, 22 May 202312:54 PM IST
12,828 పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్
దేశ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్ (India Post) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదో తరగతి అర్హతగా ఉంది. దరఖాస్తు చేసేందుకు జూన్ 11 ఆఖరు తేదీగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mon, 22 May 202311:47 AM IST
ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేడు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరగా ఆస్ట్రేలియాలో 24వ తేదీ వరకు మోదీ పర్యటించనున్నారు. సిడ్నీకి చేరుకున్న ఆయనకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనేస్ స్వాగతం పలికారు. పపువా న్యూ గినియా నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు మోదీ.
Mon, 22 May 202311:08 AM IST
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు!
మణిపూర్ రాజధాని ఇంపాల్లో నేటి మధ్యాహ్నం మళ్లీ ఘర్షణలు జరిగాయి. దీంతో ఆర్మీ, పారామిలటరీ దళాలు మోహరించాయి. మేటీ, కుకీ వర్గాలకు చెందిన వారి మధ్య ఇంపాల్లోని న్యూ చెకోన్ ప్రాంతంలో ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో కర్ఫ్యూను కూడా అధికారులు ప్రకటించారు. ఈ నెల మొదట్లో ఆ రెండు వర్గాల మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాలో తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. సుమారు 70 మంది చనిపోయారు.
Mon, 22 May 202310:20 AM IST
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు లాంచ్
టాటా ఆల్ట్రోజ్ కారుకు సీఎన్జీ వెర్షన్ లాంచ్ అయింది. రూ.7.55 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ భారత మార్కెట్లోకి వచ్చింది.
Mon, 22 May 202309:59 AM IST
భారత ప్రధాని కోసం సిడ్నీలో ఎదురుచూపులు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం చెప్పేందుకు సిడ్నీ విమానాశ్రయానికి ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయులు భారీగా చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ.. సిడ్నీ చేరుకోనున్నారు.
Mon, 22 May 202309:37 AM IST
విధానసభలో సిద్ధరామయ్య, శివకుమార్ ప్రమాణ స్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఎమ్మెల్యేలుగా విధానసభలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేశారు.
Mon, 22 May 202309:15 AM IST
ఐకూ జెడ్7ఎస్ 5జీ లాంచ్
ఐకూ జెడ్ఎస్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. రూ.18,999 ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. అమెజాన్లో సేల్ మొదలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mon, 22 May 202308:52 AM IST
రూ.2వేల నోట్ల గురించి కంగారు వద్దు: ఆర్బీఐ గవర్నర్
రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సెప్టెంబర్ 30 వరకు అంటే ఇంకా నాలుగు నెలల గడువు ఉందని, రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు పరుగులు పెట్టాల్సిన పని లేదని అన్నారు. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది. సెప్టెంబర్ 30లోగా ప్రజలు బ్యాంకుల్లో రూ.2నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది.
Mon, 22 May 202308:20 AM IST
ఆస్ట్రేలియాకు మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాపువా న్యూ గినియా నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆయన విమానం సిడ్నీలో దిగుతుంది. ఆస్ట్రేలియాలో వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు.
Mon, 22 May 202308:03 AM IST
హీట్వేవ్ అలర్ట్..
దక్షిణ హరియాణా, దిల్లీ, దక్షిణ యూపీ, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్, పశ్చిమ్ బెంగాల్లకు హీట్వేవ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మంగళవారం మాత్రం.. ఝార్ఖండ్ మినహా ఏ రాష్ట్రంలోనూ హీట్వేవ్ పరిస్థితులు ఉండవని స్పష్టం చేసింది.
Mon, 22 May 202307:20 AM IST
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 61,880కి చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 18,294 వద్ద ట్రేడ్ అవుతోంది.
Mon, 22 May 202306:28 AM IST
విధాన సభను శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు..!
కర్ణాటక విధాన సభ ప్రాంగణంలో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఉదయం పూజలు చేశారు. గోమూత్రం జల్లుతూ కనిపించారు. ‘విధాన సభను శుద్ధి చేస్తున్నాము’ అని వారు చెప్పారు.
Mon, 22 May 202306:06 AM IST
మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన
కృష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపనలో భాగంగా గంగమ్మకు సిఎం పూజలు నిర్వహించారు.
Mon, 22 May 202305:35 AM IST
ఫిజీ అత్యున్నత పురస్కారం..
ప్రధాని మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఫిజీ పౌరులు కాకుండా.. ఇతర వ్యక్తులకు ఈ పురస్కారం దక్కడం చాలా అరుదు..
Mon, 22 May 202305:18 AM IST
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు..
స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది ఇండియన్ బ్యాంక్. ఈ దఫా రిక్రూట్మెంట్లో 18 వేకెన్సీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఇండియాన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ indianbank.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Mon, 22 May 202304:40 AM IST
సరికొత్త మైలురాయిని తాకిన మహీంద్రా థార్!
ఇండియా రోడ్లపై మహీంద్రా థార్ దూసుకెళుతోంది! తాజాగా.. లక్ష సేల్స్ మైలురాయిని తాకింది.
Mon, 22 May 202304:12 AM IST
అవినాష్ అరెస్ట్పై ఉత్కంఠ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. తల్లకి అనారోగ్యం కారణంగా కర్నూలు ఉన్న అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోడానికి సిబిఐ సిద్ధం అవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Mon, 22 May 202303:47 AM IST
స్టాక్ మార్కెట్ ఇండియా..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా మొదలుపెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 91 పాయింట్లు కోల్పోయి 61,638 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 18,187 వద్ద కొనసాగుతోంది.
Mon, 22 May 202303:40 AM IST
బెంగళూరు ఓటమి..
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైన బెంగళూరు ఐపీఎల్ నుంచి ఇంటి బాటపట్టింది. గిల్ మెరుపు శతకంతో చెలరేగడంతో బెంగళూరుపై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లి సెంచరీ వృథాగా మారింది.
Mon, 22 May 202303:20 AM IST
తెలంగాణలో వర్షాలు..
ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు ఊరటనిచ్చే కబురును వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Mon, 22 May 202303:04 AM IST
ఆంధ్రప్రదేశ్ వాతావరణం..
ఆంధ్రప్రదేశ్లో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు.మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Mon, 22 May 202302:41 AM IST
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.33శాతం, ఎస్ అండ్ పీ 500 0.14శాతం, నాస్డాక్ 0.24శాతం మేర నష్టాలను చూశాయి. అమెరికాలో డెట్ సీలింగ్ ప్రక్రియ ముందుకు కదలకపోవడం ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి.
Mon, 22 May 202302:41 AM IST
ఎస్జీఎక్స్ నిఫ్టీ..
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
Mon, 22 May 202302:42 AM IST
స్థిరంగా పసిడి వెండి ధరలు..
దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 56,300గా ఉంది. దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,530గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 75,300గా ఉంది.
Mon, 22 May 202302:42 AM IST
జీ20 దేశాల సమావేశాలు..
జీ20 దేశాల 3వ టూరింజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేడు శ్రీనగర్లో ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం శ్రీనగర్ ముస్తాబైంది. పటిష్ట భద్రత మధ్య ఈ సమావేశాలు జరగనున్నాయి.