Lightning strikes: ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 60 మంది మృతి చెందినట్లు రాష్ట్ర సహాయ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. బుధ, గురువారాల్లో ఉత్తరప్రదేశ్ లోని 10 జిల్లాల్లో 43 మంది, బిహార్ లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుకు 20 మంది చనిపోయారు. రెండు రాష్ట్రాల్లో 40 మందికి పైగా గాయపడ్డారు. వర్షాకాలంలో ఇలాంటి పిడుగులు పడటం అసాధారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, వర్షాకాలానికి ముందు, వర్షాకాలం ముగిసిన తరువాత వర్షాలు కురిసే సమయంలో పిడుగులు (Lightning strikes) పడడం సర్వసాధారణమని వివరిస్తున్నారు.
‘‘ఈ ప్రాంతాలు ఇంతకు ముందు పొడిగా, వేడిగా ఉండేవి. రుతుపవనాల ద్రోణి ఉత్తరం వైపుకు మారడం ప్రారంభించినప్పుడు, తేమ చొరబాటు వల్ల అకస్మాత్తుగా చాలా ఉష్ణమండల మేఘాలు అభివృద్ధి చెందాయి. దానివల్ల పెద్ద సంఖ్యలో పిడుగులు పడుతున్నాయి’’ అని స్కైమెట్ (SKYMET) వాతావరణ విభాగం వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ చెప్పారు. అయితే, వర్షాకాలంలో ఇది చాలా అసాధారణమని, వర్షాకాలానికి ముందు నెలల్లో లేదా రుతుపవనాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో ఇలాంటి భారీ స్థాయిలో పిడుగులు పడటం మనం చూస్తుంటామని ఆయన వివరించారు.
వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల వేడి గాలి వ్యాకోచం చెందడం కూడా ఈ పిడుగులకు కారణమని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడ్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ముందుగానే అంచనా వేసిందని లైట్నింగ్ రెసిస్టెంట్ క్యాంపెయిన్ ఇండియా కన్వీనర్ కల్నల్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. మధ్య, ఈశాన్య భారతంపై విద్యుదీకరణ చెందిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ గురువారం మధ్యాహ్నం హెచ్చరించింది.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) డేటాను ప్రస్తావిస్తూ, గురువారం భారతదేశంలో సుమారు 75,000 పిడుగుపాటు సంఘటనలు జరిగాయని శ్రీవాస్తవ చెప్పారు. ఐఎండీ క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా గురువారం భారతదేశంలోనే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్రం సహా దాని ప్రాంతీయ ప్రాంతాల్లో 2,40,000 పిడుగులు పడ్డాయని అంచనా వేసింది. నైరుతి ద్వీపకల్ప భారతంలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
టాపిక్