సుప్రీంకోర్టులో సీజేఐ బీఆర్​ గవాయ్​పై దాడికి యత్నం!-lawyer tries to attack cji br gavai in supreme court he responds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సుప్రీంకోర్టులో సీజేఐ బీఆర్​ గవాయ్​పై దాడికి యత్నం!

సుప్రీంకోర్టులో సీజేఐ బీఆర్​ గవాయ్​పై దాడికి యత్నం!

Sharath Chitturi HT Telugu

సుప్రీంకోర్టులో భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై ఓ న్యాయవాది దాడి చేసేందుకు యత్నించారు. “ఇవేవీ నన్ను ప్రభావితం చేయవు,” అని సీజేఐ స్పందించారు.

సీజేఐ బీఆర్​ గవాయ్​ (PTI)

సుప్రీంకోర్టులో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది! భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై ఓ న్యాయవాది దాడికి యత్నించినట్టు సమాచారం.

పలు నివేదికల ప్రకారం.. కోర్టు విచారణ సందర్భంలో సదరు న్యాయవాది డయాస్​ వైపు దూసుకెళ్లారు. అనంతరం సీజేఐ జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై దాడి చేసే ఉద్దేశంతో తన షూని తీశారు.

అదే సమయంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకుని, అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు.

“సనాతన ధర్మానికి అగౌరవం జరగకుండా చూసుకుంటా,” అని ఆ న్యాయవాది అరుస్తూ, బయటకు వెళ్లారు.

ఇంత జరిగినప్పటికీ సీజేఐ జస్టిస్​ గవాయ్​ తన ఏకాగ్రతను కోల్పోలేదు.

“ఇలాంటి వాటిని పట్టించుకోకండి. మనం మన దృష్టిని మరల్చకూడదు. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు,” అని సీజేఐ చాలా ప్రశాంతంగా స్పందించారు.

అనంతరం కోర్టు కార్యకలాపాలను కొనసాగించారు.

న్యాయవాది అలా ఎందుకు చేశారు?

కాగా సీజేఐ జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై సదరు న్యాయవాది ఎందుకు దాడికి యత్నించారు? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ గతంలో ధ్వంసానికి గురైన విష్ణుమూర్తి విగ్రహానికి చుట్టూ ఈ వ్యవహారం నెలకొందని తెలుస్తోంది.

మధ్యప్రదేశ్​లోని ఖజురాహోలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విషయంపై దాఖలైన కేసును కొన్ని రోజుల క్రితం కొట్టి వేస్తూ.. “ఏదో ఒకటి చేయమని వెళ్లి విగ్రహాన్నే అడగండి. మీరు విష్ణు మూర్తి మహా భక్తులు అని చెప్పుకుంటున్నారు. అలా అయితే వెళ్లి ప్రార్థన చేయండి. ఆ స్థలం ఆర్కియోలాజీ కిందకు వస్తుంది. ఏఎస్​ఐ అనుమతులు ఇవ్వాలి,” అని సీజేఐ అన్నారు.

సీజేఐ వ్యాఖ్యలపై సోషల్​ మీడియాలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదంపై స్పందిస్తూ.. “నాకు అన్ని మతాలపై గౌరవం ఉంది. ఎవరినీ అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు,” అని వివరణ ఇచ్చారు.

సీజేఐకి మద్దతుగా నిలిచిన కేంద్ర సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహ్తా.. “సోషల్​ మీడియాలో ప్రతి విషయాన్ని చాలా ఎక్కువగా చూస్తుంటారు,” అన్నట్టుగా మాట్లాడారు.

“న్యూటన్​ లా ప్రకారం ప్రతి చర్యకు, సమానమైన ప్రతిచర్య ఉంటుంది. కానీ సోషల్​ మీడియాలో మాత్రం స్పందనలు చర్యలకు మించి ఉంటున్నాయి,” అని తుషార్​ మెహ్తా అభిప్రాయపడ్డారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.