Labourer finds diamond: మధ్య ప్రదేశ్ లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ కార్మికుడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అతడికి తన గనిలో 95,500 డాలర్ల విలువైన 19.22 క్యారెట్ల వజ్రం దొరికింది.
మధ్యప్రదేశ్ కు చెందిన రాజు గోండ్ (40), అతని తమ్ముడు రాకేష్ పొలాల్లో, వజ్రాల గనుల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 690 చదరపు అడుగుల ప్రభుత్వ భూమిలో బంగారం, ఇతర విలువైన ఖనిజాలను తవ్వుతూ రోజుకు రూ.800 వరకు సంపాదిస్తున్నారు. వారు కృష్ణ కల్యాణ్ పూర్ లో మైనింగ్ చేస్తుండగా రాజుకు ఈ విలువైన వజ్రం కనిపించింది.
రాజు గోండ్, అతడి తమ్ముడు రాకేశ్ గురువారం కూడా యథావిధిగా తమ గనికి పనికి వెళ్లారు. ఖనిజాల కోసం గాలిస్తుండగా, గోండ్ చేతులకు ఒక రాయి తగిలింది. అది ప్రకాశవంతంగా వెలుగుతోంది. దాన్ని చూడగానే అది ఒక విలువైన వజ్రం అని రాజుకు అర్థమైంది. "అది అద్భుతంగా మెరిసింది. అది వజ్రం అని నాకు అప్పుడే తెలుసు!" అని రాజు గోండ్ చెప్పాడు. ఆ వెంటనే గోండ్ సోదరులు తమ బైక్ పై ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం ఇద్దరూ తమ తల్లిని స్థానిక పన్నా డైమండ్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆ రాయి విలువను లెక్క గట్టించారు.
ఇది 19.22 క్యారెట్ల తెల్ల వజ్రం (Daimond) అని డైమండ్ ఎగ్జామినర్ అనుపమ్ సింగ్ తెలిపారు. దీని విలువ సుమారు 95,500 డాలర్లు ఉంటుందని చెప్పారు. మధ్యప్రదేశ్ లోని పన్నా నగరం వజ్రాల నిల్వలకు ప్రసిద్ధి చెందింది. గతంలో ఇక్కడ పలు విలువైన వజ్రాలు దొరికాయి. 1961లో ఒక వ్యక్తికి 54.55 క్యారెట్ల వజ్రం, 2018లో మరొకరికి 42 క్యారెట్ల వజ్రం లభించింది. తరచూ చిన్న చిన్న వజ్రాలు కూడా దొరుకుతుంటాయి.
ఇక్కడ స్థానిక అధికారుల పర్యవేక్షణలో విలువైన ఖనిజాల కోసం అన్వేషించాలనుకునే కుటుంబాలకు ప్రభుత్వం చిన్న, చిన్న గనులను లీజుకు ఇస్తుంటుంది. ప్రజలకు దొరికిన విలువైన ఖనిజాలపై ప్రభుత్వం 11.5% రాయల్టీ తీసుకుంటుంది. కొద్ది మొత్తంలో పన్నును విధిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆ వజ్రం దొరికిన వ్యక్తికి అందిస్తుంది.