కమేడియన్ కునాల్ కమ్రా తన యూట్యూబ్- ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన లేటెస్ట్ స్టాండప్ గిగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ వీడియోలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండేపై పరోక్షంగా 'జోక్' వేశారు కునాల్. కానీ అది శిండే మద్దతుదారులకు నచ్చలేదు. ఫలితంగా, కునాల్ ఆ స్టాండప్ కామెడీ చేసిన ‘యూనికాంటినెంటల్ ముంబై’ హోటల్పై పలువురు దాడి చేశారు. హోటల్లో కుర్చీలను ధ్వంసం చేశారు. అంతేకాదు, కునాల్పై దాడి చేస్తామని కూడా ఏక్నాథ్ శిండే శివసేనకు చెందిన కొందరు బెదిరించారు.
శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విడిపోయిన వర్గాలను ప్రస్తావిస్తూ మహారాష్ట్ర రాజకీయాలు, అక్కడి ఎన్నికలపై కునాల్ కమ్రా విమర్శలు గుప్పించారు.
'జో ఇన్హోనే మహారాష్ట్ర కే ఎలక్షన్ మే కియా హై... బోల్నా పడేగా... పెహ్లే శివసేన బీజేపీ సే బహర్ ఆ గయీ ఫిర్ శివసేన- శివసేన సే బహర్ ఆ గయీ... ఎన్సీపీ- ఎన్సీపీ సె బహర్ ఆ గయీ... ఏక్ ఓటర్ కో 9 బటన్ దిదియే... సబ్ కన్ఫ్యూజ్ హో గయే..." (మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఏం చేశారో చెప్పాల్సిందే... మొదట బీజేపీ నుంచి శివసేన విడిపోగా, ఆ తర్వాత శివసేన నుంచి శివసేన విడిపోయింది. ఎన్సీపీ నుంచి విడిపోయిన ఎన్సీపీ... చివరికి ఓటరుకు తొమ్మిది బటన్లు ఇచ్చింది.. అందరూ అయోమయానికి గురయ్యారు,'' అని కునాల్ కమ్రా అన్నారు.
"చాలూ ఏక్ జన్ నే కియా థా... వో ముంబై మే బోహోత్ బధియా ఏక్ డిస్ట్రిక్ట్ హై థానే వహా సే ఆతే హై...", అని కునాల్ కమ్రా 'దిల్ తో పాగల్ హై' చిత్రంలోని ఒక పాటను పాడడం ప్రారంభించే ముందు చెప్పారు. ఆ పాటను మార్చి ‘ద్రోహం’ అనే అర్థం వచ్చే విదంగా పాడారు కునాల్.
"యే పాలిటిక్స్ హై ఇన్కీ, పరివార్వాద్ ఖతం కర్ణ థా, కిసి కా బాప్ చురా లియా [ఇది వారి రాజకీయం, వారు కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలనుకున్నారు, ఒకరి తండ్రిని లాక్కున్నారు]" అని కునాల్ కమ్రా అన్నారు.
వాస్తవానికి కునాల్ కుమ్రా ఏక్నాథ్ శిండే పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే మహారాష్ట్రలోని థానే అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైన పేర్కొన్న జోక్లో కునాల్ థానేని ప్రస్తావించారు.
ఇది ఏక్నాథ్ శిండే మద్దతుదారులకు, ఆయన వర్గానికి చెందిన శివసేన కార్యకర్తలకు కోపం తెప్పించింది. వారు కునాల్ ఈ స్టాండప్ గిగ్ చేసిన హోటల్పై దాడి చేశారు. అంతేకాదు, శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ కునాల్ కమ్రాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
మరోవైపు యూనికాంటినెంటల్ హోటల్పై దాడి చేసిన ఆరోపణలతో శివశేన డిప్యూటీ లీడర్ రహూల్ కనల్, విభాగ్ ప్రముఖ్ శ్రీకాంత్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
హోటల్ మాత్రమే కాదు స్టాండప్ షోలు తరచుగా జరిగే ‘హాబిటెట్’ స్టూడియోపైనా శివసేన కార్యకర్తలు ఆదివారం దాడి చేశారు. కునాల్ కమ్రా లేటెస్ట్ స్టాండప్ గిగ్కి, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా శివసేన వర్గాలు పట్టించుకోలేదు. ఫలితంగా.. హాబిటెట్ని ప్రస్తుతానికి మూసివేస్తున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు.
2022 జూన్లో ఏక్నాథ్ శిండే అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటుకు నాయకత్వం వహించి, పార్టీకి దూరంగా అసోంలోని గౌహతికి వెళ్లారు.
ఠాక్రే నేతృత్వంలోని శివసేన తన ప్రధాన హిందుత్వ భావజాలం నుంచి ఎన్సీపీ, కాంగ్రెస్ వంటి సైద్ధాంతికంగా భిన్నమైన పార్టీలతో పొత్తు పెట్టుకుందని ఏక్నాథ్ శిండే వర్గం వాదించింది. అప్పుడు మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి అధికారంలో ఉంది.
వరుస ఫిరాయింపులు, న్యాయపోరాటాలు, సంప్రదింపుల తర్వాత ఏక్నాథ్ షిండే వర్గం చట్టబద్ధమైన శివసేనగా గుర్తింపు పొంది, పార్టీని రెండు వర్గాలుగా చీల్చింది. చివరికి ఏక్నాథ్ బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ శిండేకి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత.. శరద్ పవర్ బంధువు, అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చి.. ఏక్నాథ్ శిండే- ఫడణవీస్ బీజేపీతో చేతులు కలిపారు. ఈ ముగ్గురు కలిసి.. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్పై ఎన్నికల్లో పోటీ చేశారు. గతేడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.
సంబంధిత కథనం