పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్కతాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు.
కోల్కతా ఫాల్పట్ట మచ్చువ అనే ప్రాంతంలో ఉన్న రితురాజ్ అనే హోటల్లో మంగళవారం రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది.
కోల్కతా అగ్నిప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి వెళ్లారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అనేక మందిని రక్షించారు. కానీ ఈ ప్రమాదంలో 14మంది మరణించారు.
కోల్కతా హోటల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
“మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టాము. ఇందుకోసం ప్రత్యేక టీమ్ని ఏర్పాటు చేశాము,” అని కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ తెలిపారు.
కాగా మంటలు ఎగిసిపడిన కొద్ది సేపటికే హోటల్లోని వారు బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు.
“అగ్నిప్రమాదం వల్ల హోటల్తో పాటు గదుల్లో పొగ పేరుకుపోయింది. హోటల్ సిబ్బంది మెట్లు ఎక్కి, రూఫ్ మీదకు వెళ్లిపోయారు. వీరిలో ఒకరు ప్యానిక్ అయిపోయి, కిందకు దూకేశారు. ఆ వ్యక్తి మరణించాడు,” అని ఓ అధికారి వివరించారు.
ఈ ఘటనపై పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరా తీశారు. మేయర్ని ఘటనా స్థలానికి పంపించి, పరిస్థితులను సమీక్షించాలని చెప్పారు.
కోల్కతా హోటల్లో అగ్నిప్రమాదం ఘటనపై కేంద్రమంత్రి, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందార్ స్పందించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇలాంటి విషాదకర సంఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని, కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
“కోల్కతా అగ్నిప్రమాదంలో బాధితుల కోసం వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. బాధితులకు అవసరమైన వైద్య సాయం అందించాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి,” అని ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు సుకంత.
ఈ ఘటనపై పశ్చిమ్ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభంకర్ సైతం స్పందించారు. కోల్కతా కార్పొరేషన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
“ఇది విషాదకర ఘటన. అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో చాలా మంది చిక్కుకున్నారు. భద్రత లేదు, రక్షణ లేదు. కార్పొరేషన్ ఏం చేస్తోందో తెలియడం లేదు,” అని అన్నారు.
సంబంధిత కథనం