Kerala 'black magic' case: ‘నరబలి.. ముక్కలుగా నరికి..’
Kerala 'black magic' case: ప్రగతిశీల రాష్ట్రంగా పేరున్న కేరళలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంలో మూఢ నమ్మకాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి.
నరబలి ఇస్తే సంపన్నులు అవుతారన్న తాంత్రిక స్వామి మాటలు నమ్మిన ఒక కుటుంబం ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు.
ట్రెండింగ్ వార్తలు
Kerala 'black magic' case: నర బలి
నర బలితో సమస్యలు తీరి, ఆస్తులు, అంతస్తులు సమకూరుతాయని షఫీ అనే వ్యక్తి చెప్పిన మాటలు నమ్మిన దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టారు. కేరళలోని చిన్న గ్రామం ఎలంతూరుకు చెందిన దంపతులు భగవలాల్, లైలాలకు షఫీ ఫేస్ బుక్ ద్వారా పరిచయం. నరబలి ఇస్తే సమస్యలు తీరుతాయని షఫీ వారిని నమ్మించాడు. తానే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు. దాంతో, వారు అంగీకరించారు.
Kerala 'black magic' case: మొదట పద్మ..
మొదట, ఈ సంవత్సరం జూన్ లో స్థానికంగా లాటరీ టిక్కెట్లు అమ్మి జీవనం సాగించే పద్మ అనే మహళకు షఫీ మాయ మాటలు చెప్పి భగవలాల్ ఇంటికి తీసుకువచ్చాడు. వెంటనే ఆ మహిళను దారుణంగా గొంతు కోసం హతమార్చి, శరీరాన్ని ఐదు ముక్కలుగా నరికేశారు. ఆ రక్తాన్ని ఆ ఇంటి గోడలకు పూశారు. శరీర భాగాలను తమ ఇంటి వెనుక భాగంలో పూడ్చేశారు. తన తల్లి పద్మ కనిపించకపోవడంతో, ఆమె కూతురు జూన్ నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Kerala 'black magic' case: అనంతరం రోజ్లిన్
నర బలి అనంతరం కూడా పెద్దగా కలిసిరాకపోవడంతో ఆ దంపతులు మళ్లీ సెప్టెంబర్ నెలలో షఫీని సంప్రదించారు. ఈ సారి మరో నరబలి చేయాలని వారిని నమ్మించాడు. తానే రోజ్లిన్ అనే మహిళను వారి ఇంటికి తీసుకువెళ్లాడు. మొదటి హత్య తరహాలోనే ఈ మహిళను కూడా వారు కిరాతకంగా హతమార్చారు. శరీరాన్ని 56 ముక్కలు చేశారు. రక్తాన్ని ఇంటి గోడలకు పూశారు. శరీర భాగాలను ఇంటి వెనుక భాగంలో పూడ్చేశారు.
Kerala 'black magic' case: సంచలనం..
ఈ ఘటన వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి ఇంటి వెనుక తవ్వి, మృతదేహాలను వెలికితీసి, పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు కొచ్చి సీపీ నాగరాజు వెల్లడించారు. జూన్ లోనే ఈ నేరం జరిగినా, పోలీసులు సత్వరమే స్పందించకపోవడంపై విమర్శలు చెలరేగాయి. నిందితుల్లో ఒకరు అధికార పార్టీ సభ్యుడు కావడం వల్లనే పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ ఆరోపించింది.