Kashmir Target Killing: మరోసారి ఉగ్రవాదుల ఘాతుకం.. కశ్మీరీ పండిట్ హత్య
Kashmir Target Killing: కశ్మీర్లో హిందువులను టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. నేడు ఓ కశ్మీరీ పండిట్ను టెర్రరిస్టులు కాల్చి హత్య చేశారు.
Kashmir Target Killing: కశ్మీరీ పండిట్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. పుల్వామా (Pulwama) జిల్లాలో కశ్మీరీ పండిట్ (Kashmiri Pandit) వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఆయనను చంపేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని సంజయ్ శర్మ (Sanjay Sharma)గా జమ్ము కశ్మీర్ (Jammu & Kashmir) పోలీసులు వెల్లడించారు. పుల్వామాలోని అచన్ (Achan) గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
మార్కెట్కు వెళ్తుండగా..
Kashmir Target Killing: ఉగ్రవాదుల కాల్పుల్లో సంజయ్ శర్మ మృతి చెందారని జమ్ము కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. “సంజయ్ శర్మ అనే పౌరుడిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అచన్ లోని స్థానిక మార్కెట్కు ఆయన వెళుతుండగా ఇది జరిగింది. ఆయను ఆసుపత్రికి తరలించాం. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నాం. మరిన్ని వివరాలను వెల్లడిస్తాం” అని జమ్ము కశ్మీర్ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది. సంజయ్ శర్మ.. బ్యాంక్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. మార్కెట్కు వెళుతుండగా ఆదివారం ఆయనపై కాల్పులు జరిపారు టెర్రరిస్టులు.
గాలింపు చర్యలు
Kashmir Target Killing: కశ్మరీ పండిట్ సంజయ్ శర్మపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి భద్రతా దళాలు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అచన్ గ్రామం సహా చుట్టుపక్కల గాలిస్తున్నట్టు వెల్లడించారు.
ఖండించిన ఒమర్
కశ్మీరీ పండిట్పై దాడి ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు. “సంజయ్ పండిట్ మృతి వార్త వినడం చాలా బాధగా ఉంది” అని పేర్కొన్నారు. “బ్యాంక్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సంజయ్ శర్మ.. నేడు జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు. నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నా” అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
Kashmir Target Killing: కాగా, కశ్మీర్లో హిందువులే లక్ష్యంగా ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా కశ్మీర్ పండిట్లపై ముష్కరులు దాడులకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాదులు.. ఓ హిందూ ఇంట్లోకి వెళ్లి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.