Kashmir Murder Case: మహిళను చంపి.. ముక్కలుగా నరికిన వ్యక్తి: విషయం ఎలా బయటపడిందంటే!-kashmir murder case man kills woman chops off body into pieces
Telugu News  /  National International  /  Kashmir Murder Case Man Kills Woman Chops Off Body Into Pieces
ప్రతికాత్మక చిత్రం
ప్రతికాత్మక చిత్రం

Kashmir Murder Case: మహిళను చంపి.. ముక్కలుగా నరికిన వ్యక్తి: విషయం ఎలా బయటపడిందంటే!

12 March 2023, 12:08 ISTChatakonda Krishna Prakash
12 March 2023, 12:08 IST

Kashmir Murder Case: కశ్మీర్‌లో కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను ఓ వ్యక్తి హత్య చేసి అమానుషంగా ముక్కలుగా నరికాడు.

Kashmir Murder Case: మరో దారుణ హత్య జరిగింది. ఓ మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఆ తర్వాత కిరాతకంగా శరీరాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. జమ్ము కశ్మీర్‌(Jammu & Kashmir)లోని బుడ్గామ్ (Budgam) జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగింది. ఈనెల 7వ తేదీన ఈ హత్య జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు వెల్లడించారు.

కాల్ డేటా ఆధారంగా..

Kashmir Murder Case: 30 ఏళ్ల వయసు ఉన్న మహిళ ఈనెల 7వ తేదీన కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదైంది. ఆమె కాల్ డేటాను బట్టి షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు ఈనెల 8న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని విచారించారు. ఈ క్రమంలో నేరం చేసినట్టు అహ్మద్ శనివారం అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

పెళ్లికి నిరాకరించినందుకే..!

Kashmir Murder Case: బుడ్గామ్ జల్లాలోని ఓంపోరాలో అహ్మద్ ఉంటున్నాడు. హత్య వెనుక కచ్చితమైన కారణాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయితే మహిళను పెళ్లి చేసుకుంటానని అహ్మద్ తమను సంప్రదించాడని, అయితే ఆమె అందుకు అంగీకరించలేదని హతురాలి బంధువులు తెలిపారు. పెళ్లికి నిరాకరించిన కారణంగా ఆమెను అహ్మద్ చంపేశాడని ఆరోపించారు.

Kashmir Murder Case: “నాలుగు రోజుల క్రితం ఆ మహిళ మిస్ అయ్యారు. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేసినట్టు నిందితుడు చెప్పాడు. ఓంపొరా, సబ్డెన్ రైల్వే బ్రిడ్జిలతో పాటు పలు చోట్ల శరీర భాగాలను పడేసినట్టు వెల్లడించాడు. బాధితురాలి తల, ఇతర శరీర భాగాలను శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నాం. నిందితుడు మా అదుపులోనే ఉన్నాడు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం” అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

Kashmir Murder Case: అహ్మద్ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడని, ఆ పనుల నిమిత్తం తరచూ అతడు తమ ఇంటికి వచ్చేవాడని హత్యకు గురైన మహిళ బంధువులు చెప్పారు. నిందితుడు ఆమెపై కోరిక పెంచుకున్నాడని, పెళ్లికి నిరాకరించటంతో కక్షకట్టి చంపేశాడని ఆరోపించారు.

గతేడాది ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ కేసును ఈ హత్య గుర్తు చేసేలా ఉంది. గతేడాది మేలో శ్రద్ధా వాకర్‌ను తన లివిన్ పార్ట్‌నర్ అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని 35 ముక్కలుగా నరికి.. రిఫ్రిజిరేటర్‌లో దాచి పెట్టాడు. ఆ శరీర భాగాలను రోజులపాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఈ విషయంలో నవంబర్‌లో వెలుగులోకి వచ్చింది.

సంబంధిత కథనం