బీపీఎల్ కుటుంబాలకు నెలకు 2 వేలు.. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజీపీ నిర్ణయం-karnataka govt to give 2000 rupees per month to every below poverty line family soon bjp minister says
Telugu News  /  National International  /  Karnataka Govt To Give 2000 Rupees Per Month To Every Below Poverty Line Family Soon Bjp Minister Says
‘నేను నాయకుడిని‘ సదస్సుకు హాజరైన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ
‘నేను నాయకుడిని‘ సదస్సుకు హాజరైన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (DK Shivakumar Twitter)

బీపీఎల్ కుటుంబాలకు నెలకు 2 వేలు.. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజీపీ నిర్ణయం

19 January 2023, 7:30 ISTHT Telugu Desk
19 January 2023, 7:30 IST

దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ. 2,000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, రాబోయే బడ్జెట్‌లో ఈ నిర్ణయం ప్రకటిస్తామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక మంగళవారం తెలిపారు.

కల్బుర్గి (కర్ణాటక): తాము కర్ణాటకలో అధికారంలోకి వస్తే కుటుంబ పెద్ద అయిన ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన మరుసటి రోజే బీజేపీ దానికి కౌంటర్‌గా మరో కొత్త స్కీమ్ లీక్ చేసింది.

రాష్ట్రంలోని ప్రతి బీపీఎల్ కుటుంబానికి నెలకు రూ. 2 వేలు చొప్పున సాయం అందించాలని నిర్ణయించామని, వచ్చే బడ్జెట్‌లో దీనికి సంబంధించి ప్రకటన వెలువడుతుందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోని మహిళ ఇంటి పెద్దలకు నెలకు రూ. 2000 అందిస్తామని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ప్రకటించిన కొద్ది గంటలకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.

మంగళవారం రాత్రి మాచనాల తండాలో బస చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు రూ. 2 వేలు ఇస్తామని ప్రకటించారని, అది జూలై నుంచి వర్తిస్తుందని, అయితే తాము మాత్రం వెంటనే ప్రారంభించబోతున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై దీనిపై మరింత సమాచారం ఇస్తారని ఆయన తెలిపారు. ప్రియాంక గాంధీ కార్యక్రమంపై కూడా అశోక విరుచుకుపడ్డారు, ‘మేం నేను నాయకుడిని, నేను నాయకురాలిని అని అనడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా చెప్పినట్లు మేమంతా సేవకులం’ అని అన్నారు.

బెంగుళూరులో జరిగిన ఒక సభలో ప్రియాంక గాంధీ ‘గృహ లక్ష్మి యోజన’ పథకం ద్వారా ‘షరతులు లేని సార్వత్రిక ప్రాథమిక ఆదాయం’గా సంవత్సరానికి రూ. 24,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా గత 75 ఏళ్లుగా చేయని పనిని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిందని కర్ణాటక రెవెన్యూ మంత్రి పేర్కొన్నారు.