Karnataka: మాజీ సీఎం యడ్యూరప్ప ఇంటిపై దాడి: రిజర్వేషన్ల విషయంలో భారీ ఆందోళన: వీడియో
Karnataka - Yediyurappa house attacked: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంపై దాడి జరిగింది. ఆయన ఇంటి ముందు వేలాది మంది ఆందోళన చేశారు. వివరాలివే..
Karnataka - Yediyurappa house attacked: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప (BS Yediyurappa) నివాసంపై దాడి జరిగింది. కర్ణాటకలోని శివమొగ్గలో ఉన్న ఆయన ఇంటిపై నిరసనకారులు సోమవారం రాళ్లు రావ్వారు. కర్ణాటకలోని బంజారా (Banjara) వర్గానికి చెందిన వేలాది మంది సోమవారం.. యడ్యూరప్ప నివాసం ముందు ఆందోళన నిర్వహించారు. విద్య, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ (ST) కమ్యూనిటీలో రిజర్వేషన్ అంతర్గత వర్గీకరణ కోసం కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఉప కులాల వారీగా రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా బంజారా వర్గానికి చెందిన వారు వేలాది మంది ఈ నిరసన చేశారు. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
ఆందోళన హింసాత్మకం
Karnataka - Yediyurappa house attacked: కొత్త రిజర్వేషన్ విధాన ప్రతిపాదనకు నిరసనగా ఆందోళనకారులు.. సీఎం బస్వరాజు బొమ్మై, యడ్యూరప్ప చిత్రపటాలను దహనం చేశారు. యడ్యూరప్ప నివాసం ముందు వేలాది మంది నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఈ ఆందోళన హింసాత్మకమైంది. కొందరు యడ్యూరప్ప ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఇక ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు.. వాటర్ క్యానన్లను ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు.
డిమాండ్ ఇదే
షెల్యూల్డ్ కులాల్లోని ఉప కులాలకు రిజర్వేషన్లలో దమాషా పద్ధతిని సిఫారసు చేస్తూ ఏజే సదాశివ కమిషన్ రిపోర్టు ఇచ్చింది. దీని ఆధారంగా కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ రిపోర్టును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బంజారాలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రిపోర్టు పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని చెబుతున్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ప్రశాంతంగా కలిసి మెలిసి ఉంటున్న ఎస్టీల మధ్య ఈ రిపోర్టు చిచ్చుపెడుతోందని ఆందోళనకారులు ఆరోపించారు. దీనివల్ల కులాల మధ్య విభజన వస్తుందని అంటున్నారు. ఆ కమిటీ సిఫారసులను ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, ఓబీసీ ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్ను తొలగిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సీఎం బస్వరాజ్ బొమ్మై ప్రకటించారు. ఆ నాలుగు శాతం రిజర్వేషన్ను ఒక్కళిగలు, లింగాయత్కు విభజించింది ఆ రాష్ట్ర సర్కారు. 10 శాతం రిజర్వేషన్ ఉన్న ఎకనమికలీ వీకర్ సెక్షన్ (EWS)లోకి ముస్లింలను చేర్చింది.
మరో మూడు నెలల్లోగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార బీజేపీ రిజర్వేషన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వీటిపై రాజకీయ దుమారం రేగుతోంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చేసింది.
“ఆస్తుల్లాగా రిజర్వేషన్లను పొంచవచ్చని వారు (ప్రభుత్వం) అనుకుంటున్నారు. అది మైనార్టీల హక్కు. రిజర్వేషన్లను తొలగించడం రాజ్యంగబద్ధం కాదు” అని కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. 45 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ముస్లింలకు మళ్లీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు.