ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మృతి.. ఆస్తి కోసం హత్య చేశారా?-karnataka ex dgp om prakash found dead at his bengaluru home under mysterious circumstances ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మృతి.. ఆస్తి కోసం హత్య చేశారా?

ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మృతి.. ఆస్తి కోసం హత్య చేశారా?

Anand Sai HT Telugu

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారని తెలుస్తోంది. బెంగళూరులోని తన నివాసంలో రక్తపు మడుగుల్లో కనిపించారు.

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(ఫైల్ ఫొటో)

ర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాశ్ ఆదివారం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రక్తంతో తడిసిన ఆయన మృతదేహం కనిపించింది. ఈ సంఘటన గురించి మాజీ డీజీపీ భార్య పల్లవి పోలీసులకు సమాచారం అందించారు.

ఓం ప్రకాశ్ శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఇది హత్యకు గురై ఉండవచ్చనే అనుమానాన్ని పెంచుతుందని పోలీసులు తెలిపారు. అతని బంధువులలో ఒకరు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

ఓం ప్రకాశ్ మరణం గురించి పోలీసులు ఆయన భార్య, కుమార్తెను విచారించడం ప్రారంభించారు. పిటిఐ నివేదిక ప్రకారం.. గతంలో కొంతమంది సన్నిహితుల నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓం ప్రకాశ్ తన మొత్తం ఆస్తిని తన కొడుకుకు బదిలీ చేయాలనుకుంటున్నారని ఇండియా టీవీ తెలిపింది. అతని భార్యకు ఈ నిర్ణయం నచ్చలేదని తెలుస్తోంది. ఈ సమయంలో భార్య ప్రధాన అనుమానితురాలుగా ఉందని అంటున్నారు. కానీ ఆయన మరణం గురించి మొదట పోలీసులకు సమాచారం ఇచ్చింది ఓం ప్రకాశ్ భార్యే. పోలీసులు వచ్చినప్పుడు, ఆమె తలుపు తెరవడానికి నిరాకరించింది. ఆ తర్వాత అనుమానం మరింత పెరిగిందని చెబుతున్నారు.

1981 బ్యాచ్‌కు చెందిన ఓం ప్రకాశ్‌కు ప్రస్తుతం 68 ఏళ్లు. బీహార్‌లోని చంపారన్‌కు చెందినవారు ఆయన. ఎం.ఎస్సీ పట్టా పొందారు. మార్చి 1, 2015న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. తర్వాత రిటైర్డ్ అయ్యారు. అంతకుముందు అగ్నిమాపక, అత్యవసర సేవలతో పాటు హోమ్ గార్డులకు కూడా నాయకత్వం వహించారు.

ఓం ప్రకాశ్‌ను కత్తితో పొడిచి చంపారని ఆరోపణలు ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నట్టుగా కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితులను తెలుసుకోవడానికి పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.