Bharat Jodo Yatra - Kamal Hasan: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు లోకనాయకుడు
Bharat Jodo Yatra - Kamal Hasan: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు ప్రముఖ నటుడు, తమిళనాడు రాజకీయ నేత కమల్ హాసన్. పూర్తి వివరాలు ఇవే.
Bharat Jodo Yatra - Kamal Hasan: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు కాస్త విరామం ఇచ్చారు. ఈ పాదయాత్ర 100 రోజులు ముగిశాక బ్రేక్ ప్రకటించారు. మళ్లీ ఈనెల 24వ తేదీన ఢిల్లీలో భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం కానుంది. కాగా, ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్.. భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడవనున్నారు. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
రాహుల్ గాంధీ ఆహ్వానంతో..
Bharat Jodo Yatra - Kamal Hasan: ఈనెల 24వ తేదీన భారత్ జోడో యాత్రలో లోకనాయకుడు కమల్ హాసన్ పాల్గొనున్నారు. ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యం ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించింది. రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు ఆయన ఈ యాత్రలో పాల్గొంటారని వెల్లడించింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కమల్ హాసన్ కూడా ఓటమి పాలయ్యారు. అయితే తొలి నుంచి బీజేపీ వ్యతిరేక గళాన్నే కమల్ వినిపిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన భారత జోడో యాత్రను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రామేశ్వరంలో ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఇప్పటి వరకు ఈ యాత్ర సాగింది. 100 రోజులు పూర్తయింది.
కాగా, భారత్ జోడో యాత్ర 100వ రోజున రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఓ కాన్సెర్ట్ కూడా నిర్వహించింది. దీన్ని ఓ విజయంగా ఆ పార్టీ పేర్కొంది. సునిధి చౌహాన్తో పాటు మరికొందరు సింగర్స్ ఈ మ్యూజికల్ కాన్సెర్ట్లో పాడారు.
Raghuram Rajan in Bharat Jodo Yatra: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గత వారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో ముచ్చటిస్తూ కాసేపు నడిచారు. అనంతరం దేశ ఆర్థిక పరిస్థితిపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ.. సోషల్ మీడియాలో పంచుకుంది.
సమైక్యతే లక్ష్యంగా, పార్టీలకు అతీతంగా ఈ భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు రాహుల్ గాంధీ గతంలోనే చెప్పారు. దీంతో కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీలకు చెందిన కొందరు నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు రాహుల్తో నడిచారు. కొందరు సినీ ప్రముఖులు, మాజీ అధికారులు కూడా పాల్గొన్నారు. నటి స్వర భాస్కర్, ఒలింపిక్ పతక బాక్సర్, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ మధ్యప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో నడిచారు.
ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ తర్వాత జమ్ము కశ్మీర్ వరకు ఈ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. 2023 ఫిబ్రవరి మొదట్లో ఈ యాత్ర ముగియనుంది.