పవిత్ర కైలాస మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ లో తిరిగి ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కొవిడ్ వ్యాప్తి ఆంక్షలు, వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన మధ్య ఐదేళ్ల క్రితం 2020లో కైలాస మానస సరోవర్ యాత్రను నిలిపివేశారు.
కైలాస మానస సరోవర్ యాత్ర హిందువులు, బౌద్ధులు, జైనులు, బోన్ మతాన్ని అనుసరించేవారు చేసే పవిత్ర యాత్ర. యాత్రలో భక్తులు హిమాలయాల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లో 15,000 అడుగుల ఎత్తుకు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఏడాది 50 మంది యాత్రికుల చొప్పున ఐదు బృందాలు ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మీదుగా, 50 మంది చొప్పున ఉన్న పది బృందాలు సిక్కింలోని నాథూలా పాస్ మీదుగా ప్రయాణిస్తాయని ఎంఈఏ తెలిపింది.
కైలాస మానస సరోవర్ యాత్రకు అధికారిక వెబ్సైట్ http://kmy.gov.in. ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. న్యాయమైన, కంప్యూటర్ ఆధారిత, లింగ-సమతుల్య యాదృచ్ఛిక ఎంపిక ప్రక్రియ ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా 2020 లో కైలాస మానస సరోవర్ యాత్రను నిలిపివేశారు. ఆ తరువాత, భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఈ పవిత్ర యాత్రను పున: ప్రారంభించడం మరింత ఆలస్యమైంది.
కైలాస మానస సరోవర్ యాత్ర 2025 రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే కైలాస మానస సరోవర్ యాత్ర 2025 జూన్ నుంచి ఆగస్టు వరకు జరగనుంది. ఈ ఏడాది ఒక్కో బ్యాచ్ లో 50 మంది యాత్రికుల చొప్పున 5 బ్యాచ్ లు ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ ద్వారా ఈ యాత్ర చేపడ్తారు. మరోవైపు, ఒక్కో బ్యాచ్ లో 50 మంది చొప్పున 10 బృందాలు సిక్కింలోని నాథూ లా పాస్ ద్వారా వెళ్తారు. యాత్రలో పాల్గొనేందుకు యాత్రికులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో, బ్యాచ్ లను ఎలా ఎంపిక చేస్తారో కూడా మంత్రిత్వ శాఖ వివరించింది.
2015 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ద్వారానే కైలాస మానస సరోవర్ యాత్రకు భక్తులను ఎంపిక చేస్తున్నారు. ఈ సారి కూడా పూర్తిగా ఆన్ లైన్ లోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అందువల్ల, దరఖాస్తుదారులు సమాచారం పొందడానికి లేఖలు లేదా ఫ్యాక్స్ పంపాల్సిన అవసరం లేదు. ‘వెబ్ సైట్ లోని ఫీడ్ బ్యాక్ ఆప్షన్లను సమాచారాన్ని పొందడానికి, పరిశీలనలను నమోదు చేయడానికి లేదా మెరుగుదల కోసం సూచనలు చేయడానికి ఉపయోగించవచ్చు" అని మంత్రిత్వ శాఖ వివరించింది.
సంబంధిత కథనం