దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన దిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్యూఎస్యూ) ఎన్నికలపై బిగ్ అప్డేట్! వామపక్షాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. టాప్ 4 పోస్టులకు గాను మూడింటిని కైవశం చేసుకున్నాయి. కాగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ఏబీవీపీ) చాలా కాలం తర్వాత ఒక పోస్టు దక్కించుకుని కమ్బ్యాక్ ఇచ్చింది.
ఏప్రిల్ 18న జరగాల్సిన జేఎన్యూఎస్యూ ఎన్నికలు.. క్యాంపస్లో హింస వంటి కారణాలతో ఆలస్యమై, చివరికి ఏప్రిల్ 25న జరిగాయి. దాదాపు 70శాతం మంది ఓటు వేశారు. అంటే సుమారు 5,500మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజాగా వెలువడిన జేఎన్యూఎస్యూ ఎన్నికల ఫలితాల్లో నితీశ్ కుమార్ (ఏఐఎస్ఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మనీష (డీఎస్ఎఫ్) వైస్-ప్రెసిడెంట్ పదవిని దక్కించుకున్నారు. ఫాతిమా (డీఎస్ఎఫ్) జనరల్ సెక్రటరీ పదవిని సొంతం చేసుకున్నారు.
"విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తాము. ప్రతి విద్యార్థి గొంతుకను అందరు గౌరవించి, వారి మాటలను వినేలా చేయడమే మా లక్ష్యం," అని జేఎన్యూఎస్యూ నూతన అధ్యక్షుడు నితీశ్ కుమార్ తెలిపారు.
ఈ దఫా ఎన్నికల్లో ఏబీవీపీ ప్రదర్శన హైలైట్గా నిలించింది. దశాబ్ద కాలంగా ఒక్క పోస్టు కూడా గెలవని ఏబీవీపీ.. ఈ దఫా జరిగిన జేఎన్యూ ఎన్నికల ఫలితాల్లో అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక పోస్టును దక్కించుకుంది. ఏబీవీపీకి చెందిన వైభవ్ మీనా జాయింట్ సెక్రటరీ పదవిని కైవశం చేసుకున్నారు.
వాస్తవానికి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో సెంట్రల్ ప్యానెల్ రేసులో ఏబీవీపీ అభ్యర్థులు ముందు వరుసలో నిలబడ్డారు. సాంప్రదాయ జేఎన్యూ వామపక్ష ఆధిపత్యానికి ఈ ఏబీవీపీ అభ్యర్థులు బలమైన పోటీని ఇచ్చారు. కానీ చివరికి వచ్చేసరికి ప్రెసిడెంట్, వైస్-ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పదవుల్లో ఓడిపోయి.. జాయింట్ సెక్రటరీ పోస్టుతో సరిపెట్టుకుంది ఏబీవీపీ.
కానీ తాజా జేఎన్యూఎస్యూ ఫలితాలతో ఒక విషయం స్పష్టమవుతోంది. ఏబీవీపీ అభ్యర్థులు- ఇతర అభ్యర్థుల మధ్య గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువ ఉంది. దీనిబట్టి జేఎన్యూ వ్యవహారాల్లో మార్పు కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
ఈ దఫా ఎన్నికల్లో ఏఐఎస్ఏ- డీఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ- ఫ్రెంటర్నిటీ కూటమి పాల్గొన్నాయి.
కౌన్సిలర్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి, 42 సీట్లకుగాను 23 చోట్ల గెలిచి చరిత్ర సృష్టించింది ఏబీవీపీ. 1999 నుంచి ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్!
ఏబీవీపీ పుంజుకోవడంతో జేఎన్యూ క్యాంపస్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈసారి వచ్చిన ఫలితాలను ఏబీవీపీ లీడర్లు, మద్దతుదారులు 'టర్నింగ్ పాయింట్' అని అభివర్ణించారు.
సంబంధిత కథనం