Jarkhand political crisis: చత్తీస్గఢ్కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
జార్ఖండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించే ఉత్తర్వులు నేడో, రేపో రానున్న పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణపై అధికార పక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Jarkhand political crisis: ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించిన అనంతరం, పరిణామాలు వేగంగా చోటు చేసుకునే అవకాశముంది. అధికార పక్షంలోని JMM, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టే అవకాశాలున్న నేపథ్యంలో.. వారిని కాపాడుకునే దిశగా అధికార పక్షం చర్యలు ప్రారంభించింది.
ట్రెండింగ్ వార్తలు
Jarkhand political crisis: చత్తీస్గఢ్కు..
జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పరిస్థితులు కుదుటపడేవరకు ఏదైనా రిసార్ట్ లో ఉంచాలని జార్ఖండ్ అధికార పక్షం భావిస్తోంది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయితే సేఫ్ అని భావించిన హేమంత్ సొరేన్ వారిని పశ్చిమ బెంగాల్ కానీ, చత్తీస్గఢ్ కానీ పంపించాలని ఆలోచించారు. చివరకు, చత్తీస్గఢ్కు పంపించేందుకు నిర్ణయించారు.
J'khand political crisis: బస్సులు సిద్ధం
రోడ్డు మార్గాన ఎమ్మెల్యేలను తరలించడానికి మూడూ ఏసీ లగ్జరీ బస్సులను సిద్ధం చేశారు. వాటి వెనుక కొన్ని ఎస్కార్ట్ వాహనాలను కూడా పంపించనున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి పలు దఫాలుగా ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఇంటివద్ద అధికార పక్ష ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చర్చలు జరిపారు. తాజాగా, శనివారం ఉదయం జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలంతా తమ లగేజ్తో పాటు హాజరు కావడం గమనార్హం. శనివారం సాయంత్రం లోగా వారిని చత్తీస్గఢ్ పంపించేందుకు రంగం సిద్ధం చేశారు.
J'khand political crisis: బీజేపీ కుట్ర..
ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆఫర్లు ఇస్తోందని జేఎంఎం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అధికార పక్షానికి అసెంబ్లీలో సురక్షితమైన మెజారిటీనే ఉంది. 82 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార పక్షంలో జేఎంఎంకు 30, కాంగ్రెస్కు 18, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యేలున్నారు. విపక్ష బీజేపీకి 26 మంది సభ్యులున్నారు.
J'khand political crisis: ఎందుకు అనర్హత..
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, సొంతంగా తనకు ఒక గనిని లీజుకు ఇచ్చుకోవడంపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్ రమేశ్ బియాస్కు సిఫారసు చేసింది. దీనిపై త్వరలో గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు.