AK rifles case | 100 కోట్ల మైనింగ్ స్కామ్కు సంబంధించి ఈడీ విచారణ జరుపుతోంది. ఆ దర్యాప్తులో భాగంగా రాంచీలోని ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. వారి సోదాల్లో ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లోని ఐరన్ అల్మారాలో దాచిన రెండు ఏకే 47 తుపాకులు లభ్యమయ్యాయి. వాటిని వెంటనే స్థానిక పోలీసులకు స్వాధీనం చేశారు.
చివరకు పోలీసుల విచారణలో ఆ తుపాకులు ఎక్కడివో తేలింది. రాంచీ పోలీసులకు చెందిన రెండు ఏకే 47 తుపాకులే అవని నిర్ధారించారు. ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లోకి ఆ తుపాకులు ఎలా వెళ్లాయో సంబంధిత పోలీసులు వివరించారు. ఈ ఏకే 47 తుపాకులతో ఇద్దరు పోలీసులు తమ సహచరుడిని కలుసుకోవడం కోసం ప్రేమ్ ప్రకాశ్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ఆ తుపాకులను, బుల్లెట్లను అక్కడి ఐరన్ అల్మారాలో ఉంచి, తాళం వేసి, తాళంచెవి తీసుకువెళ్లారు. అయితే, మర్నాడు వాళ్లు తిరిగి ఆ ఇంటికి తిరిగి వచ్చేసరికి, అక్కడ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. దాంతో, వారు ఆ తుపాకులను తీసుకోలేకపోయారు. ఈలోపు, ఈడీ అధికారులకు ఆ అల్మారాలో ఆ ఏకే 47 తుపాకులతో పాటు 60 బుల్లెట్లు లభించాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ఇద్దరు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు.