Japanese Encephalitis: 44 మందిని పొట్టన పెట్టుకున్న జపనీస్ ఎన్సెఫలైటిస్
Japanese Encephalitis: జపనీస్ ఎన్సెఫలైటిస్ కారణంగా అసోంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 44 మంది మరణించారు.
గౌహతి, జూలై 27: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) రాష్ట్ర శాఖ అందించిన సమాచారం ప్రకారం దోమల ద్వారా సంక్రమించే వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ (ఒకరకమైన మెదడు వాపు వ్యాధి) ద్వారా అసోంలో ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు.
ట్రెండింగ్ వార్తలు
వరదల తర్వాత అస్సాంలో జపనీస్ మెదడువాపు వ్యాధి మరింత తీవ్రంగా మారింది. సాధారణంగా దోమలు ఈ వైరస్ను వ్యాప్తి చేస్తాయి. ఈ వైరస్ వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, వాంతులు, జ్వరం, మూర్చ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
గత 24 గంటల్లో రాష్ట్రంలో ముగ్గురు మరణించారు. నాగోన్ జిల్లాలో ఇద్దరు, చిరాంగ్ జిల్లాలో ఒకరు మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎనిమిది కొత్త జపనీస్ ఎన్సెఫలైటిస్ కేసులు కూడా నమోదయ్యాయని నేషనల్ హెల్త్ మిషన్ అసోం విభాగం వెల్లడించింది. నాగాన్లో మూడు, టిన్సుకియాలో రెండు, చిరాంగ్, జోర్హాట్, కమ్రూప్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
గత 26 రోజుల్లో రాష్ట్రంలో మొత్తం 274 జపనీస్ ఎన్సెఫలైటిస్ కేసులు నమోదయ్యాయి. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2015 నుండి 2021 మధ్య కాలంలో జపనీస్ ఎన్సెఫలైటిస్ కారణంగా అసోంలో 660 మంది మరణించారు.
2015లో మొత్తం 135 మంది ఈ వ్యాధితో మరణించారు. 2016లో 92 మంది, 2017లో 87 మంది, 2018లో 94 మంది, 2019లో 161 మంది, 2020లో 51 మంది, 2021లో 40 మంది మరణించారు.
అసోంలోని గోలాఘాట్, జోర్హాట్, మజులీ, శివసాగర్, చరైడియో, దిబ్రూఘర్, లఖింపూర్, నాగావ్, హోజాయ్, మోరిగావ్, బార్పేట, నల్బరి, బక్సా, చిరాంగ్, ఉదల్గురితో సహా పలు జిల్లాలు ఈ వ్యాధి బారిన పడ్డాయి.
వ్యాప్తి నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితిని పరిష్కరించడానికి నేషనల్ హెల్త్ మిషన్ ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని, మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు వ్యాధికి వ్యతిరేకంగా భారీ అవగాహన ప్రచారాలను నిర్వహిస్తున్నారు.
టాపిక్