'పిడుగు పడి ఏడుగురు మృతి', 'పిడుగుపాటుకు ఆరుగురు బలి' అని నిత్యం వార్తలు వింటూనే ఉంటాము. మరీ ముఖ్యంగా వర్షా కాలంలో పిడుగు అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడుతుందో అంచనా వేయడం ఆ నిమిషంలో కష్టం కాబట్టి, పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఈ సమస్యకు జపాన్ శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనుగొన్నారు! పిడుగును కంట్రోల్ చేసే విధంగా ఒక టెక్నాలజీని రూపొందించారు. ఈ టెక్నాలజీ ద్వారా మెరుపును కంట్రోల్ చేసి, దాన్ని సురక్షిత ప్రాంతంలో పడే విధంగా దారి మళ్లిస్తారు. పిడుగుపాటు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకే ఈ టెక్నాలజీని తీసుకొచ్చినట్టు జపాన్ చెబుతోంది. అసలేంటి ఈ టెక్నాలజీ?
జపాన్ రూపొందించిన ఈ టెక్నాలజీ.. ప్రపంచంలోనే తొలి వాతావరణ కంట్రోల్ వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. మెరుపులను ఇది పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిడుగును కంట్రోల్ చేసేందుకు ఈ స్పెషల్ డ్రోన్ టెక్నాలజీని జపాన్ రూపొందించింది. ఇందులో భాగంగా ఒక డ్రోన్ మేఘాల్లోకి వెళ్లి, వాటిల్లో ఏర్పడే మెరుపులను కంట్రోల్ చేస్తుంది. అనంతరం సరక్షిత ప్రాంతాల్లో అవి పడే విధంగా ఈ టెక్నాలజీ చర్యలు చేపడుతుంది.
మెరుపుల వల్ల జపాన్కు ప్రతియేటా 113.66 బిలియన్ల నష్టం వాటిల్లుతోందని అంచనాలు ఉన్నాయి. వాటిని తగ్గించడంతో పాటు ప్రజా భద్రత దృష్ట్యా జపాన్కి చెందిన నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది. రెండు నెలల పాటు ఈ టెక్నాలజీని పరీక్షించారు. గతేడాది డిసెంబర్లో హమద అనే నగరంలో ఈ టెక్నాలజీ టెస్టింగ్ మొదలైంది. ఒక డ్రోన్ని ఎగిరేసి, మేఘాల్లోకి తీసుకెళ్లారు. మేఘాల్లోకి వెళ్లిన తర్వాత ఈ డ్రోన్ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ని డిటెక్ట్ చేసింది. ఆ తర్వాత డ్రోన్కి ఉన్న ఒక స్విచ్ని కింద ఉన్న శాస్త్రవేత్తలు యాక్టివేట్ చేశారు. ఆ తర్వాత, పిడుగును కంట్రోల్ చేసినట్టు, దాని దిశను మార్చి, సురక్షిత ప్రాంతంలో పడేసినట్టు జపాన్ అధికారులు వెల్లడించారు.
ఈ టెక్నాలజీలో ఉపయోగించిన డ్రోన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఒక ప్రత్యేక లోహంతో తయారు చేసిన కేజ్ (బోను)లో దానిని పెట్టారు. ఈ బోను.. మెరుపులను తట్టుకోగలదు. డ్రోన్లోని కొన్ని సున్నితమైన ప్రాంతాలకు మాత్రమే మెరుపు చేరుకోగలుగే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.
జపాన్లోని నగరాలు, భారీ భవనాలు, ఫ్యాక్టరీలు, ఇతర మౌలికవసతులను రక్షించేందుకు ఈ తరహా డ్రోన్ టెక్నాలజీని రూపొందించారు.
ఈ కొత్త టెక్నాలజీతో పిడుగులపై పరిశోధనలు కూడా చేయవచ్చు. అవి ఏర్పడటానికి వెనక కారణాలను మరింత లోతుగా విశ్లేషించవచ్చు. తద్వారా మరింత మెరుగైన వ్యవస్థలను రూపొందించవచ్చు.
సంబంధిత కథనం