జమ్మూలోని సాంబా సెక్టార్ గుండా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గురువారం రాత్రి జరిపిన ఆపరేషన్లో హతమార్చినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ సందర్భంగా చొరబాటుదారులకు మద్దతుగా భారత్ వైపు పాక్ రేంజర్స్ పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ప్రతిగా బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ సరిహద్దు ఔట్ పోస్టు ధ్వంసమైంది.
జమ్మూ ఫ్రాంటియర్ సాంబా సెక్టార్లో, 2025 మే 8, 9 తేదీల మధ్య రాత్రి, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీనిని నిఘా గ్రిడ్ గుర్తించింది. ఈ చొరబాటు ప్రయత్నానికి ధంధార్ పోస్ట్ నుంచి, ఆ తర్వాత పాక్ రేంజర్ల నుంచి కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టాయి. కనీసం ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. పాక్ ధంధార్ పోస్ట్ కు భారీ నష్టం వాటిల్లింది’’ అని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.
2025 మే 08, 09 తేదీల మధ్య రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సాయుధ దళాలు డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించి అనేక దాడులు చేశాయి. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు పలు మార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. భారత దళాలు పాక్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. సీఎఫ్వీలకు ధీటైన సమాధానం ఇచ్చారు. ‘‘దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి భారత సైన్యం కట్టుబడి ఉంది. అన్ని దుర్మార్గపు కుట్రలను బలప్రయోగంతో తిప్పికొడతాం’’ అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
సంబంధిత కథనం