Jagannath temple Ratna Bhandar: పూరి జగన్నాథుడి ఖజానా ‘రత్న భండార్’ ను తెరిచేది రేపే; పాముల భయంతో అధికారులు-jagannath temple ratna bhandar opening retired hc judge to supervise inventory ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jagannath Temple Ratna Bhandar: పూరి జగన్నాథుడి ఖజానా ‘రత్న భండార్’ ను తెరిచేది రేపే; పాముల భయంతో అధికారులు

Jagannath temple Ratna Bhandar: పూరి జగన్నాథుడి ఖజానా ‘రత్న భండార్’ ను తెరిచేది రేపే; పాముల భయంతో అధికారులు

HT Telugu Desk HT Telugu
Published Jul 13, 2024 07:28 PM IST

Puri Jagannath temple: ఒడిశాలోని పూరిలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథుడి ఆలయం వైపే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆ ఆలయ ప్రాంగణంలో విలువైన బంగారు, వజ్రాభరణాలు దాచి ఉంచిన రత్న భండార్ ను అధికారుల సమక్షంలో జూలై 14, ఆదివారం తెరవబోతున్నారు. అయితే, ఆ గది లోపల పాములు ఉండొచ్చని అధికారులు భయపడ్తున్నారు.

పూరి జగన్నాథుడి రత్న భండార్ ను తెరిచేది రేపే
పూరి జగన్నాథుడి రత్న భండార్ ను తెరిచేది రేపే

Puri Jagannath temple: పూరిలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథుడి ఆలయ ప్రాంగణంలోని రత్న భండార్ లేదా జగన్నాథ ఆలయం ఖజానాను రేపు ఆదివారం తెరవనున్నారు. గతంలో చివరి సారిగా ఈ రత్న భండార్ ను 4 దశాబ్దాల క్రితం 1978 లో తెరిచి, అందులోని విలువైన ఆభరణాలను లెక్కించారు. ఇప్పుడు మళ్లీ ఆడిట్ కోసం ఆ రత్న భండార్ ను తెరవనున్నారు.

పాముల భయం

కొన్ని దశాబ్దాల తరువాత తెరుస్తున్న నేపథ్యంలో, రత్న భండార్ లో విషపూరిత పాములు ఉండొచ్చని ఆడిట్ లో పాల్గొనే అధికారులు భయపడ్తున్నారు. అదీకాక, సాధారణంగా దేవుడికి సంబంధించిన ఆస్తులకు పాములు కాపలా ఉంటాయన్న విశ్వాసం కూడా ఉంది. ఈ నేపథ్యంలో, రత్న భండార్ ను తెరిచి, ఆభరణాలను లెక్కించే సమయంలో అధికారులు, పోలీసులతో పాటు స్నేక్ హెల్ప్ లైన్ సభ్యులు, కొందరు వైద్యుల కూడా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. వారి సమక్షంలో జగన్నాధుడి ఆలయం (Puri Jagannath temple) లోని ముగ్గురు దేవతలకు చెందిన అనేక విలువైన వస్తువుల ఖజానాను ఆదివారం తెరవనున్నారు.

హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో..

ఖజానాలోని విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ పర్యవేక్షించనుంది. రత్న భండార్ లోపల విలువైన వస్తువులను స్పష్టంగా చూసేందుకు వీలుగా తగిన లైటింగ్ ఏర్పాట్లు చేశారు. రత్న భండార్ లోకి ప్రవేశించిన తర్వాత కమిటీ సభ్యుల్లో ఎవరైనా అస్వస్థతకు గురైతే వైద్యుల బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచనున్నారు. రత్న భండార్ లోపల చెక్క పెట్టెల్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయని, అందులో వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నందున అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో పరిశీలించాల్సి ఉందని కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

వారం రోజులుగా శాకాహారం

రత్న భండార్ లోకి ప్రవేశించే కమిటీ సభ్యులు వారం రోజులుగా శాకాహారులుగా మారారు. ‘రత్న భండార్ లోకి ప్రవేశించే ముందు అందరూ జగన్నాథ ఆలయ సేవకుల మాదిరిగా ధోతీ, గంచా ధరిస్తారు. ఆ తరువాత, లోపలికి ప్రవేశించే ముందు ఖజానాకు అధిదేవతగా భావించే లోకనాథుడిని కమిటీ సభ్యులు పూజిస్తారు’ అని సభ్యుడు తెలిపారు. రత్న భండార్ తెరిచిన తరువాత, పాత ఆభరణాలను గుర్తించడానికి స్వర్ణకారుల బృందాన్ని కూడా పిలుస్తామని జస్టిస్ (రిటైర్డ్) బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఆలయం లోపల ఆభరణాలను తరలించి లెక్కించే స్థలాన్ని ఆలయ యాజమాన్యం గుర్తించింది. ఆభరణాల స్వభావం (22 లేదా 24 క్యారెట్లు), రత్నాల స్వభావాన్ని పరిశీలిస్తారు. ఆ తరువాత రత్నా భండార్ విలువైన వస్తువులను డిజిటల్ కేటలాగ్ చేసి, ఈ ప్రక్రియను వీడియోగ్రాఫ్ చేస్తారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా..

రత్న భండార్ ను తెరిచే సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఆలయ సందర్శన కొనసాగించవచ్చని, అయితే ఆ సమయంలో స్వామిని దూరం నుంచి చూసి తృప్తి చెందాల్సి ఉంటుందని పర్యవేక్షక కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.

రత్న భండార్ ఎక్కడ ఉంది?

జగన్నాథ ఆలయంలోని జగమోహన సమీపంలో ఉన్న రత్న భండార్ ఒక చిన్న ఆలయం వలె కనిపిస్తుంది మరియు 11.78 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది రెండు గదులను కలిగి ఉంది. అవి బహరా భండార్ (బాహ్య గది) మరియు భితారా భండార్ (లోపలి గది). ఈ రెండు గదుల్లోనూ దేవతల ఆభరణాలు ఉంటాయి. రత్న భండార్ లోపలి గది బాహ్య గది కంటే చాలా పెద్దది. గత కొన్ని శతాబ్దాలుగా ఒడిశాను పాలించిన అనేక రాజవంశాల రాజులు, నేపాల్ పాలకులు కూడా బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన సంపదను ఆలయానికి విరాళంగా ఇచ్చారని ఆలయ మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ భాస్కర్ మిశ్రా తెలిపారు.

రత్న భండార్ లో ఉన్న ఆభరణాలు

రత్న భండార్ యొక్క మొదటి అధికారిక వివరణ 1805 లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ తయారు చేసిన నివేదికలో వచ్చింది. రత్న భండార్ లో రత్నాలు, స్వచ్ఛమైన బంగారం, వెండితో కూడిన 64 బంగారు, వెండి ఆభరణాలతో పాటు 128 బంగారు నాణేలు, 24 రకాల బంగారు 'మొహర్', 1,297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1,333 రకాల దుస్తులు ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. కొన్ని బంగారు ఆభరణాలు నెమలి ఈకలు, చంద్రుడు, సూర్యుడు, పెద్ద కిరీటం, గోల్డెన్ డిస్క్, తామర, పులి గోర్లు ఆకారంలో ఉన్నాయని చార్లెస్ గ్నోమ్ తయారు చేసిన నివేదికలో పేర్కొన్నారు. 1950 తర్వాత శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చట్టం, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ అమల్లోకి వచ్చినప్పుడు రికార్డు ఆఫ్ రైట్స్ (ROR) తయారు చేశారు, ఇందులో బహరా భండార్లో 150 బంగారు ఆభరణాలు, 180 రకాల ఆభరణాలు, 146 వెండి వస్తువులు ఉన్నాయని ప్రకటించారు.

చివరగా 1978 లో..

1978లో రత్న భండార్ (Ratna Bhandar) చివరి జాబితా సమయంలో ఖజానాలోని రెండు గదుల్లో 128.380 కిలోల నికర బరువు కలిగిన 454 బంగారు వస్తువులు, 221.530 కిలోల బరువున్న 293 వెండి వస్తువులు లభించాయి. లోపలి గదిలో 43.640 కిలోల బరువున్న 367 బంగారు వస్తువులు, 148.780 కిలోల బరువున్న 231 వెండి వస్తువులు, వెలుపలి గదిలో 84.74 కిలోల బంగారు వస్తువులు, 73.64 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. 1978 తర్వాత 1982, 1985లో రెండుసార్లు ఇన్నర్ ఛాంబర్ తెరిచినా ఆడిట్ జరగలేదు. ఆ రెండు సందర్భాల్లో గర్భగుడి ప్రధాన ద్వారం వెండి వస్త్రధారణతో పాటు బలభద్రుడి బంగారు 'చిత' మరమ్మతు కోసం కొంత వెండి, బంగారాన్ని బయటకు తీశారు.

ఎన్నికల అంశం..

రత్నా భండార్ ను తెరవడం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. రత్న భండార్ లోని విలువైన ఆభరణాలు మాయమయ్యాయని బీజేపీ విమర్శించింది. తాము అధికారంలోకి వస్తే ఖజానాను ఆడిట్ చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.