IT Survey at BBC office : ‘భయం లేకుండా వార్తలు అందిస్తాము’- ఐటీ సర్వేపై బీబీసీ
IT Survey at BBC office : బీబీసీ కార్యాలయాల్లో ఐటీశాఖ సర్వే ముగిసింది. మూడు రోజుల తర్వాత బీబీసీ ఆఫీసులను ఐటీశాఖ అధికారులు విడారు. ఈ వ్యవహారంపై బీబీసీ స్పందించింది.
IT Survey at BBC office : ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ కార్యాలయాలపై ఐటీశాఖ చేపట్టిన 'సర్వే' గురువారం రాత్రితో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో పలు డిజిటల్ రికార్డ్లు, ఫైల్స్ని సర్వే చేశారు ఆదాయపు పన్నుశాఖ అధికారులు. బీబీసీ ఢిల్లీ ఆఫీసుకు చెందిన సీనియర్ ఎడిటర్లతో పాటు మొత్తం మీద 10 మంది ఉద్యోగులు.. మూడు రోజుల తర్వాత ఇళ్లకు చేరుకున్నారు.
బీబీసీ కార్యాలయాలపై చేపట్టిన చర్యల గురించి ఐటీశాఖ శుక్రవారం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై ఆదాయపు పన్నుశాఖ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సంబంధి వర్గాల ప్రకారం.. సర్వేలో భాగంగా.. అనేక మంది బీబీసీ ఉద్యోగుల ఫోన్స్ను అధికారులు తీసుకున్నారు. వాటితో పాటు ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ని కూడా క్షుణ్నంగా పరిశీలించారు. ట్యాక్స్, బ్లాక్ మనీ, బినామీ వంటి పేర్లతో డివైజ్లను సెర్చ్ చేశారు.
'భయం లేకుండా వార్తలు అందిస్తాము..'
ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఐటీశాఖ చేపట్టిన సర్వేపై బీబీసీ స్పందించింది.
"ఢిల్లీ, ముంబైల్లోని మా కార్యాలయాలను ఐటీశాఖ అధికారులు విడిచిపెట్టి వెళ్లిపోయారు. అధికారులకు మేము సహకరిస్తాము. ఈ వ్యవహారం తొందరగా ముగిసిపోవాలని భావిస్తున్నాము. మేము చాలా సహకరించాము. మాలో చాలా మంది సుదీర్ఘ ప్రశ్నలు ఎదుర్కొన్నారు. రాత్రిళ్లు కూడా ప్రశ్నల వర్షం కురిశాయి. మా ఉద్యోగుల సంక్షేమం మాకు ముఖ్యం. ఇక ఇప్పుడు మా ఔట్పుట్ సాధారణ స్థితికి చేరింది. భారతీయులకు సేవ చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము. బీబీసీపై అందరికి నమ్మకం ఉంది. ఇదొక స్వతంత్ర మీడియా సంస్థ. మా ఉద్యోగులు, జర్నలిస్ట్లకు మేము అండగా ఉంటాము. భయం లేకుండా నివేదికలు అందిస్తాము. అనుకూలత, సానుకూలతలు లేకుండా వార్తలిస్తాము," అని బీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
గత మంగళవారం ఉదయం బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాలకు వెళ్లారు ఐటీశాఖ అధికారులు. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, బీబీసీ సబ్సిడరీ సంస్థలకు చెందిన ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ వంటి అంశాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. గురువారం రాత్రి వరకు ఆయా కార్యాలయాల్లోనే ఉన్నారు. అయితే.. తొలుత ఇది ఐటీ దాడులని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వ్యవహారంపై ఐటీశాఖ స్పష్టతనిచ్చింది. ఇది కేవలం సర్వే అని, ఐటీ దాడులు కాదని పేర్కొంది.
మోదీపై డాక్యుమెంటరీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో ఇండియాలో బీబీసీ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తోంది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించింది బీబీసీ. ఇది ఇండియాలో నిషేధానికి గురైంది. బీబీసీ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది జరిగిన కొన్ని రోజులకే.. బీబీసీ కార్యాలయాలపై ఐటీశాఖ చర్యలు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు బీబీసీ కార్యాలయాల్లో ఐటీశాఖ సర్వేపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. దేశంలో మీడియా వ్యవస్థ ఏదో ఒక రోజు నాశనం అవుతుందని విమర్శించాయి. కాగా.. ఐటీశాఖ అధికారులు విపక్షాల ఆరోపణలను ఖండించారు. సర్వేకు సంబంధించి.. గతంలోనే నోటీసులు ఇచ్చినట్టు, కానీ వాటిపై బీబీసీ సరిగ్గా స్పందించలేదని వివరించాయి.
సంబంధిత కథనం