BrahMos fired into Pak land: గత సంవత్సరం మార్చి 9 న భారత వైమానిక దళం ప్రయోగించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి (BrahMos supersonic missile) పొరపాటున పాక్ భూభాగంలో పడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇందుకు బాధ్యులైన ముగ్గురు వైమానిక దళ అధికారులను విధుల నుంచి తొలగించింది.
ఈ పనిష్మెంట్ ను ఆ ముగ్గురు వైమానిక దళ అధికారుల్లో ఒకరు ఢిల్లీ హై కోర్టులో సవాలు చేశారు. దాంతో, తమ వివరణను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హై కోర్టుకు వెల్లడించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున కోర్టుకు అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ హాజరయ్యారు. పాకిస్తన్ భూభాగంపై ల్యాండ్ అయ్యేలా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి (BrahMos supersonic missile) ని ప్రయోగించడం క్షమార్హం కాని నేరమని ఆయన కోర్టుకు తెలిపారు. సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, ఆ ఘటన పాకిస్తాన్, భారత్ ల మధ్య మరో యుద్ధానికి కారణమయ్యేదని వెల్లడించారు. సాయుధ దళాల్లో విధుల్లో ఉన్న అధికారుల అలసత్వం వల్ల దారుణమైన విపరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. పొరుగుదేశ ముందే కాకుండా, అంతర్జాతీయ సమాజం ముందు భారత ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి కల్పించే అలాంటి ఘటనలను వైమానిక దళం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని స్పష్టం చేశారు.
సిమ్యులేషన్ ఎక్సర్ సైజ్ సమయంలో ఈ పొరపాటు జరిగిందని వైమానిక దళ నిర్ణయాన్ని సవాలు చేసిన అధికారి కోర్టుకు తెలిపారు. తన బాధ్యత మిస్సైల్ నిర్వహణ (missile maintenance) మాత్రమేనని, ఆ క్షిపణి ప్రయోగం (missile firing) తో తన పాత్ర లేదని ఆయన వాదించారు. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగ బాధ్యత సీఓ(CO) ది, ట్రైనింగ్ ఆఫీసర్ (training officer) దని వివరించారు. అందువల్ల ఈ ప్రమాదానికి తనను శిక్షించడం సరికాదని వాదించారు.