Stock market crash : రూ. 5.47 లక్షల కోట్ల సంపద ఆవిరి.. సెన్సెక్స్ 1500 డౌన్
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్లు డౌన్ అవడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 5.47 లక్షల కోట్ల మేర పతనమైంది.
న్యూఢిల్లీ, జూన్ 13: స్టాక్ మార్కెట్ మదుపరులు సోమవారం ఉదయం ఆరంభ ట్రేడింగ్లో రూ. 5.47 లక్షల కోట్లు నష్టపోయాారు. సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్లు నష్టపోవడంతో మదుపరుల సంపద ఆవిరైంది.

30 షేర్ల సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఉదయం 15668.46 పాయింట్లు కోల్పోయి 52,734 పాయింట్ల వద్ద ట్రేడైంది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 451.9 పాయింట్లు కోల్పోయి 15,749 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
ఈక్విటీ మార్కెట్ల పతనంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల క్యాపిటలైజేషన్ దాదాపు రూ.5 ,47,410.81 కోట్ల మేర ఆవిరైంది.
గ్యాప్ డౌన్తో నిఫ్టీ ఓపెన్ అయ్యింది. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని చవిచూశాయి. అమెరికాలో మే నెలలో ద్రవ్యోల్భణం రేటు నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరింది. ఈ పరిస్థితి కారణంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ రేట్లు భారీగా పెరుగుతాయని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఈ బుధవారం మానిటరీ పాలసీ సమావేశం ఉంది.
‘దేశీయంగా ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా సోమవారం విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి..’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్ హెమాంగ్ జనీ అన్నారు.
సెన్సెక్స్ సూచీలోని బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ తదితర స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
ఇక ఏషియాలోని టోక్యో, హాంగ్ కాంగ్, షాంఘై తదితర మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. యూఎస్ స్టాక్ మార్కెట్లు సైతం శుక్రవారం భారీగా నష్టపోయాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం సుమారు రూ. 3,973.95 కోట్ల మేర ఈక్విటీ అమ్మకాలతో నికర విక్రయదారులుగా నిలిచారు.
సంబంధిత కథనం
టాపిక్