ారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. పాకిస్థాన్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తే భారత్ తిప్పికొట్టింది. ఆ తర్వాత దాడి చేసింది. పాకిస్థాన్లోని అనేక వైమానిక రక్షణ విభాగాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ డ్రోన్ హారోప్ గురించి చర్చ నడుస్తోంది. ఈ డ్రోన్ వల్ల పాకిస్థాన్లో జరిగిన విధ్వంసం ఆ దేశ సైన్యం స్వయంగా వివరించింది. ఈ సూసైడ్ డ్రోన్ లాహోర్తో సహా పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో వారి వైమానిక రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ తయారు చేసిన హారోప్ డ్రోన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
హారోప్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) MBT క్షిపణుల విభాగం నిర్మించిన దాడి డ్రోన్. ఈ డ్రోన్ శత్రు భూభాగంపై తిరుగుతూ ఆదేశం అందిన వెంటనే దాడి చేయగలదు. ఈ డ్రోన్ స్వయంగా పనిచేయగలదు లేదా రిమోట్ ద్వారా కూడా నియంత్రించొచ్చు. అది ఏ టార్గెట్ కనుగొనలేకపోతే తిరిగి మన స్థావరానికి వస్తుంది.
నిర్దిష్ట సైనిక లక్ష్యాలను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ హారోప్ డ్రోన్ను రూపొందించారు. ఇది UAV, క్షిపణి రెండింటిలోనూ పనిచేస్తుంది. UAV అంటే మానవరహిత వైమానిక వాహనం. ట్యాంకులు, రాడార్ స్టేషన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ సెంటర్లు, సరఫరా డిపోలు వంటి నిర్దిష్ట సైనిక లక్ష్యాలను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి, నాశనం చేయడానికి ఇది రూపొందించారు.
ఈ డ్రోన్లో ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఈ సెన్సార్లు నిఘా పోస్టులు, రాడార్లు వంటి లక్ష్యాలను గమనించడానికి సహాయపడతాయి. ఆ తర్వాత ఈ డ్రోన్ దాని లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతుంది. హారోప్ డ్రోన్ తొమ్మిది గంటల పాటు నిరంతరం లక్ష్యాలను వెతుకుతుంది. ఇది ఒక నిర్ణీత ప్రాంతంపై ఎగురుతుంది, లక్ష్యాన్ని గుర్తిస్తుంది. తరువాత దాడిని ప్లాన్ చేస్తుంది. వివిధ కోణాల నుండి దాడి చేస్తుంది.
ఈ డ్రోన్ GNSS జామింగ్ను నివారించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఈ సామర్థ్యం క్లిష్ట వాతావరణాలలో కూడా కమ్యూనికేషన్ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ డ్రోన్లను కామికేజ్ డ్రోన్లు అని కూడా అంటారు. మందుగుండు సామగ్రితో నిండి ఉంటాయి. గాలిలో తమ టార్గెట్ కోసం చూసి వెళ్లి నాశనం చేస్తాయి. హారోప్ 20 కిలోల పేలుడు పదర్థాలను మోసుకెళ్తుంది. ఏడు గంటల వరకూ గాలిలోనే ఉండగలదు.