ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. కారణం ఏంటి?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు కృస్ గోపాలకృష్ణన్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది! ఆయనతో పాటు మరికొందరిపైనా బెంగళూరు పోలీసులు కేసు వేశారు. అసలు కారణం ఏంటంటే..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మాజీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మందిపై బెంగళూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. గిరిజన వర్గానికి చెందిన ఓ వ్యక్తి చేసిన తీవ్ర ఆరోపణలతో పోలీసులు వీరిపై కేసు వేశారు.

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై కేసు..
71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సీసీహెచ్) ఆదేశాల మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
హనీ ట్రాప్ కేసులో తనన తప్పుగా ఇరికించారని, ఆ తర్వాత క్రిస్ గోపాలకృష్ణన్ ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో ఉద్యోగం నుంచి కూడా తొలగించారని దుర్గప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఫిర్యాదుదారుడు దుర్గాప్ప గిరిజన బోవి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
2014 వరకు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీలో అధ్యాపకుడిగా దుర్గప్ప పనిచేసేవాడు. కానీ తప్పుడు ఆరోపణలతో తనని ఇరికించారని పేర్కొన్నాడు. తనపై కులపరమైన దూషణలు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని దుర్గప్ప ఆరోపించారు.
క్రిస్ గోపాల్కృష్ణన్తో పాటు గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంధ్య విశ్వేశ్వరయ్య, హరి కేవీఎస్, దాసప్ప, బలరాం పి, హేమలతా మిషి, చటోపాధ్యాయ కె, ప్రదీప్ డి సావ్కర్, మనోహరన్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
దీనిపై ఐఐఎస్సీ అధ్యాపకుల నుంచి గానీ, క్రిస్ గోపాలకృష్ణన్ నుంచి గానీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
క్రిస్ గోపాలకృష్ణన్ ఎవరు?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్.. 2011 నుంచి 2014 వరకు ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్గా, 2007 నుంచి 2011 వరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు.
క్రిస్ గోపాలకృష్ణన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2013-14 సంవత్సరానికి భారత అత్యున్నత పరిశ్రమ ఛాంబర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జనవరి 2014 లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కో-చైర్మన్లలో ఒకరిగా పనిచేశారు.
2011 జనవరిలో భారత ప్రభుత్వం గోపాలకృష్ణన్ని దేశ మూడొవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్తో సత్కరించింది.
క్రిస్ గోపాలకృష్ణన్ మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీలు పొందారు. క్రిస్ ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఎన్ ఏఈ) ఫెలో, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) ఆఫ్ ఇండియా గౌరవ ఫెలో అని ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రొఫైల్ పేర్కొంది.
సంబంధిత కథనం